Kurnool District News: కర్నూలు జిల్లా 4వ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో ముద్దాయిలకు కర్నూలు జిల్లా నాలుగో అదనపు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జంట హత్యల కేసులో ఇద్దరికి ఉరి శిక్ష, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళలపై నేరాలు చేసే వారికి ఈ కేసులో పడిన శిక్షలు భయం కలిగించాలని జిల్లా ఎస్పీ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కర్నూలు ఎస్పీ జి. కృష్ణకాంత్ వివరించారు.


డీజీపీ కెవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో మహిళలకు సంబంధించిన కేసులలో త్వరితగతిన కేసు ట్రయల్స్ పూర్తి చేసి శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ‘‘కర్నూలు జిల్లా కల్లూరు మండలం, చెన్నమ్మ సర్కిల్ లో గత సంవత్సరం జంట హత్యల కేసులు నమోదయ్యాయి. వధువును, ఆమె తల్లిని దారుణంగా హత్య చేసి, వధువు తండ్రిపై హత్యాయత్నం చేశారు. గత ఏడాది  తెలంగాణ, వనపర్తి జిల్లాకు చెందిన రుక్మిణికి కర్నూలుకు చెందిన శ్రవణ్ తో వివాహం జరిగింది.


వివాహం అయిన 3 రోజుల తరువాత వధువు రుక్మిణీ తల్లిదండ్రులు అయిన వెంకటేష్, రమాదేవి.. పెళ్ళి కుమారుడైన శ్రవణ్, అతని తల్లిదండ్రులు వర ప్రసాద్, కృష్ణవేణిలతో శ్రవణ్ కుమార్ నపుంసకుడని గొడవపడ్డారు. ఈ విషయంపై ముద్దాయిలు వీరి కుటుంబం పరువు పోతుందని పెళ్ళికూతురు, ఆమె తల్లితండ్రులను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో కర్నూలు టౌన్ చింతలముని నగర్ లోని ఇంటి వద్ద కత్తులతో పొడవగా వధువు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవి అక్కడికక్కడే చనిపోయారు. వధువు తండ్రి వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. 




గాయపడిన వధువు తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు, కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో Cr.No.62/2023 U/s 498 (A), 302, 307 R/w 34 IPC గా కేసు నమోదు చేశారు. తీవ్ర రక్త స్రావ గాయాలతో ఉన్న పెళ్ళి కూతురు తండ్రి వెంకటేష్ ని కర్నూలు 4 వ పట్టణ పోలీసులు హాస్పిటల్ తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం అందించారు. ముద్దాయిలైన శ్రవణ్ కుమార్, వరప్రసాద్, కృష్ణవేణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముద్దాయిలను జైల్లోనే పెట్టి ట్రయల్ పూర్తి చేయడం జరిగింది. 


ఈ కేసులో 90 రోజులలో విచారణ పూర్తి చేసి, చార్జ్ షీట్ ను కర్నూలు డీఎస్పీ విజయశేఖర్, కర్నూలు నాలుగో పట్టణ సీఐ పి. శంకరయ్యను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కేసును నాలుగో జిల్లా అదనపు కోర్టు జడ్జి విచారణ పూర్తి చేసి ఫిబ్రవరి 21న తీర్పు ఇచ్చారు.  


శిక్షలు ఇవీ..
న్యాయమూర్తి వెల్లడించిన తీర్పు ప్రకారం ముద్దాయి A-1 శ్రవణ్ కుమార్, A-2 వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ కు ఉరి శిక్ష వేశారు. A-3 కృష్ణవేణికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి ఈ కేసు గుణపాఠంగా, కనువిప్పు కలిగేలా చేసిందని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. ఈ కేసును 10 నెలల్లోనే దర్యాప్తు, ట్రయల్ పూర్తి చేయించి, సాక్షులను, సాక్ష్యా ధారాలను ఎప్పటికప్పుడూ హాజరు పరచిన పోలీసు అధికారులను, ఈ కేసు వాదించిన పబ్లిక్ ప్యాసిక్యూటర్ వై. ప్రకాష్ రెడ్డిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.