కడప: వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన బాలిక రామకీర్తన హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక గొంతుకోసి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ రాజేంద్రప్రసాద్ మీడియాకు వెల్లడించారు.

Continues below advertisement

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 10వ తేదీన ఖాజీపేట అగ్రహారంలో రామకీర్తన అనే బాలికను వెంకటేష్ అత్యంత క్రూరంగా హత్య చేశాడు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అతను అటవీ ప్రాంతంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడటంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిసిందే. గాయపడిన నిందితుడు వెంకటేష్‌ను తొలుత మైదుకూరు ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.

చికిత్స పూర్తి చేసుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు పోలీసులపై దాడి చేసినందుకు గానూ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పి.టి వారెంట్‌పై అతడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Continues below advertisement

ప్రేమించలేదని యువతి గొంతుకోశాడు..

కడప జిల్లా ఖాజీపేటలో జరిగిన రామకీర్తన హత్య రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తనను ప్రేమించడం లేదనే కనికరం లేని కక్షతో వెంకటేష్ అనే యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. కేవలం 17 ఏళ్ల వయసున్న రామకీర్తన ఇంటిలోకి చొరబడి, ఆమె గొంతు కోసి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. ఈ నెల 14వ తేదీన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాల్సిన ఆ బాలిక, అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. పండగలా ఉండాల్సిన ఆ ఇల్లు కళ తప్పింది.

ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు కొన్ని రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నారు. అయితే, మైదుకూరు నుండి అతడిని తరలిస్తుండగా బసాపురం చెక్‌పోస్ట్ వద్ద నిందితుడు పోలీసులపై తిరగబడ్డాడు. కానిస్టేబుళ్లపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు లొంగిపోకపోవడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అనివార్యంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెంకటేష్ రెండు మోకాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడిని భారీ బందోబస్తు నడుమ కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, పట్టపగలే జరిగిన ఈ ఘోర హత్యపై స్థానికులు, బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉన్మాది చేతిలో బలైన బాలికకు న్యాయం చేయాలని వారు నినదించారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కుమారుడు అమాయకుడంటూ తల్లి ఆవేదన

రామకీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత కొన్ని రోజుల కిందట మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి జేబులో దొరికిన లేఖ ద్వారానే వారి ప్రేమ వ్యవహారం తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు వెంకటేష్ ఇంటికి వచ్చి, తనను హత్తుకుని ఏడ్చాడని తెలిపారు. కీర్తన తనను మోసం చేసిందని, నిలదీయగా ఆమె కత్తితో బెదిరించిందని, ఆ పెనుగులాటలోనే ప్రమాదవశాత్తు గొంతు తెగిందని తన కొడుకు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. బాలిక తల్లిదండ్రులు ముందే హెచ్చరించి ఉంటే బాగుండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.