Balakrishna: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తన బలాన్ని కోల్పోతూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ పార్టీ నేతలు ప్రత్యామ్నాయ పార్టీలవైపు తొంగి చూస్తూ ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకునేందుకు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటే కనుమరుగవుతామని మరో పార్టీలోకి వలసలు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోంది. 


తెలుగుదేశం వైపు మొగ్గు : 
గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చలాయించింది. రాష్ట్రంలో ఉన్న ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప దాదాపు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లను క్లీన్ స్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటేనే ఎవరైనా పార్టీలో ఉంటారని ఆ పార్టీ నేతలు మరోసారి రుజువు చేసినట్లు అయింది. వైసీపీలో వారి క్యాడర్‌కు ఈక్వల్ గా తెలుగుదేశం పార్టీలో నాయకులతో చర్చించి అనంతరం తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. 


హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ టిడిపిలోకి : 
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో గత వైసిపి ప్రభుత్వం పురపాలక సంఘాన్ని కైవసం చేసుకుంది. గత ప్రభుత్వంలో సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట హిందూపురాన్ని వైసిపి వశం చేసుకోవాలని గతంలో అనేక వ్యూహాలు రచించారు. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి చైర్మన్ పీఠాన్ని వైసిపి దక్కించుకుంది.


హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉండగా ఆ ఎన్నికల్లో 30 మంది వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. 6 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఒకరు బిజెపి, మరొకరు ఎంఐఎం పార్టీ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం టిడిపి సంఖ్యాబలం 6 ఉండగా వైసిపి మున్సిపల్ చైర్‌పర్శన్ ఇంద్రజతో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 


దీంతో పురపాలికలో తెలుగుదేశం సంఖ్యాబలం 18కి చేరింది. మరో ఇద్దరు తెలుగుదేశం పార్టీలోకి చేరితే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకొని ఉంది. ఇదే నెలలోనే అత్యవసర మున్సిపల్ సమావేశం నిర్వహించి చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టింది. 


టీడీపీలో చేరిన తర్వాత మున్సిపల్ ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీ టీడీపీ కైవశం చేసుకునేందుకు పార్టీ వ్యక్తిని ఛైర్మన్ పదవిలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని లోకల్‌గా టీడీపీ లీడర్లు చెబుతున్నారు. ఆమె స్థానంలో రమేష్‌ను నియమించనున్నారని తెలుస్తోంది. 


మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టిన తెలుగుదేశం: 
అధికారం కోల్పోయిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఆ పార్టీ సంఖ్యాబలం రోజురోజుకీ తగ్గుతూ వస్తుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో ఇప్పటికే వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. నందమూరి ఖిల్లాగా ఉన్న హిందూపురం పురపాలక సంఘంలోనూ వైఎస్ఆర్సిపి చేతిలో ఉన్న పురపాలక సంఘం మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం హస్తగతం చేసుకొనుంది ఇప్పటికే ఆ పార్టీ నుంచి చైర్మన్ ఇంద్రజతోపాటు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు టిడిపిలోకి చేరడమే ఇందుకు కారణం. దీంతో రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో తన బలాన్ని వైఎస్ఆర్సిపి కోల్పోతూ వస్తుంది. ఇంకా ఎన్ని మున్సిపాలిటీల్లో ఈ విధంగా జరుగుతుందో అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.