EV park in Kurnool district | మంగళగిరి: ఏపీలో పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ‘పర్యావరణహితమైన వాహనాల వినియోగం పెరగాలి. ఏ రూపంలోనైనా సరే కాలుష్యాన్ని భారీగా తగ్గించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టిపెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరగాలని ఏపీ అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పీపుల్ టెక్ సంస్థ ఓర్వకల్లు వద్ద 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఎంఓయూకు సంబంధించిన వివరాలను పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టి.జి విశ్వప్రసాద్ తెలిపారు.
'వాహన తయారీ, టెస్టింగ్ ట్రాక్స్, ఆర్. అండ్ డి. కేంద్రాలు, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలు లాంటివి ఇందులో ఉంటాయి. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వెహికల్ పార్కు. దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. తద్వారా 25 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని' విశ్వప్రసాద్ వివరించారు.
‘కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్ (Electric Vehicle Park) ఏర్పాటు కానుండటం శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఒక మైలు రాయి లాంటిది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకి అనువైన విధానాలు తీసుకొచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారుు. పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్తో సమావేశమైన భేటీలో భాస్కర రెడ్డి, బాబ్ డఫ్ఫీ, రవికిరణ్ ఆకెళ్ళ, హెరాల్డ్ రక్రిజెల్, స్టీవ్ గెర్బర్ ఉన్నారు.
Also Read: Chandrababu on Population: ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !