ఏపీలో మూడు చోట్ల ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటల్స్‌ తమ స్టార్ హోటల్స్ కట్టడం శుభపరిణామం అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్టార్‌ హోటల్స్ గ్రూపుల రాకతో గ్రాండ్ క్యానన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తామని అన్నారు. దీంతో గండికోటను ప్రపంచానికి పరిచయం కాబోతోందని అన్నారు. ఒబెరాయ్ లాంటి పెద్ద కంపెనీలు గండికోటలో స్టార్ హోటల్ ఏర్పాటు హర్షణీయం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా గండికోటలో ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి పెద్ద పెద్ద హోటల్ గ్రూప్ రావడం వల్ల గండికోటను గ్లోబల్ టూరిజం మ్యాప్ లోకి తీసుకుపోగలమని అన్నారు. తిరుపతి, విశాఖపట్నంలో కూడా ఇలాంటి హోటల్ వస్తుందని అన్నారు. ఈ హోటల్ వల్ల కడప జిల్లాతో పాటు గండికోట ప్రపంచ పటంలో స్థానం సంపాదించుకుంటామని చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోనే స్టీల్ ఫ్యాక్టరీ రాబోతోందని చెప్పారు. గత ఏడాది దీనికి సంబంధించి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. స్టీల్ ప్రాజెక్టుకు ఈ జూలై 15కు పర్యావరణ అనుమతులు వచ్చేస్తాయని చెప్పారు. ఆ వెంటనే పనులు వేగంగా జరుగుతాయని వివరించారు.


ఒబెరాయ్ హోటల్స్ గండికోటకు రావడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. కనీసం 500 నుంచి 800 మంది వరకూ ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ గండికోటలోనే ఇంకా ఇలాంటి ప్రాజెక్టులే మరిన్ని వస్తాయని చెప్పారు. కొప్పర్తి డిక్సన్‌ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు ఎంవోయూలు చేసుకుంటామని, గండికోటలో గోల్ఫ్‌ కోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఒబెరాయ్‌ని కోరానని చెప్పారు.


స్టార్ హోటళ్లకు శంకుస్థాపన


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెవెన్ స్టార్ హోటళ్లకి శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు మండలం గండికోట వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణం కోసం సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్‌ హోటల్స్‌ ఎండీ విక్రమ్‌సింగ్‌ ఒబెరాయ్‌, ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్‌  పాల్గొన్నారు.


తర్వాత పులివెందులలో కొన్ని ప్రారంభోత్సోవాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. పులివెందుల మున్సిపల్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత కౌన్సిలర్లతో సమావేశం అయ్యారు.