దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో దేవుడి దయతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ అనేది ఎప్పటి నుంచో కలలుగన్న కల అని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కలలుగన్నారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాతి నుంచి ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టింకోలేదని విమర్శించారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళ పల్లెలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ తో పాటుగా సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడారు.


రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్లాంటుకి సకల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం తరపున దాదాపు రూ.700 కోట్ల ఖర్చుతో మౌలిక వసతుల సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్‌ మొదటి దశ పూర్తవుతుందని అన్నారు. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో చుట్టుపక్క అనుబంధాల రంగాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చదువుకున్న మన కుటుంబాల పిల్లలకు మన ప్రాంతంలో ఉపాధి లభిస్తుందని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం కూడా తెచ్చామని అని సీఎం జగన్‌ అన్నారు.


ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుంది. స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్‌ రావడం కోసం చాలా కష్టాపడాల్సి వచ్చింది. అయినా దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్‌ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్‌ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్‌ మాట్లాడారు.


వైఎస్ఆర్ నాకు మంచి మిత్రుడు - సజ్జన్ జిందాల్


తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినప్పుడు వైఎస్‌ జగన్‌ యువకుడని గుర్తు చేసుకున్నారు. ఆయన్ను ముంబయికి తీసుకెళ్లి వ్యాపార సూత్రాలు నేర్పించాలని వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి తనతో చెప్పారని అన్నారు. 15-17 ఏళ్ల క్రితం జగన్‌ ముంబయిలోని తన ఆఫీస్‌కు కూడా వచ్చారని చెప్పారు. ‘‘ఇప్పుడు ఏపీని సీఎం జగన్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజా సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా జగన్‌ భావిస్తున్నారు. విజయవాడలో సీఎంతో కలిసి లంచ్‌ చేసినప్పుడు రాష్ట్రం గురించి చాలా మాట్లాడుకున్నాం. వైద్య ఆరోగ్య రంగం నుంచి డిజిటలైజేషన్‌ వరకూ ఆయన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి. నాకు తెలుగు మాట్లాడటం రాదు లేదంటే నేను చెప్పే విషయాలు మీకు పూర్తిగా మీకు అర్థమయ్యేవి. సీఎం జగన్‌ లాంటి యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని సజ్జన్‌ జిందాల్‌ సీఎంను ఉద్దేశించి కొనియాడారు.