Buggana Rajendranath Reddy: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 19వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనునున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో పోలీస్ గెస్ట్ హౌస్‌లో సమావేశమై సమీక్ష చేశారు. 77 చెరువులకు కృష్ణా జలాలు అందించే 'హంద్రీనీవా' సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం డోన్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారని అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని ఆదేశించారు. 


కర్నూలు జిల్లాలో సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించనున్నట్లు చెప్పారు. అనంతరం పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామం, ఆలంకొండ వద్ద హంద్రీనీవా కాలువపై నిర్మించిన పంపింగ్ స్టేషన్ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించనున్నారు. డోన్ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను తనిఖీ చేయనున్నారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు మంత్రి బుగ్గన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


పర్యటన ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ సమీక్ష 
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన మోహనరెడ్డి ఈనెల 19న డోన్‌ రానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. డోన్ నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన అధికారులను ఆదేశించారు. మూడు రోజుల క్రితం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారులకు అప్పగించిన పనులు బాధ్యతాయుతంగా చేపట్టి ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. 


హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వేదిక వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించారు. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దుమ్ము లేవకుండా వాటరింగ్ పెద్దఎత్తున చేయాలని ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 


హెలిప్యాడ్, మీటింగ్ సమీపాల్లో ఏర్పాటు చేసిన సేఫ్ రూముల్లో అత్యవసర మందులతో పాటు నిపుణులైన డాక్టర్లు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ, జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు. గ్రీన్ రూమ్, సభా వేదిక, విజిటర్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా జాగ్రత్తగా చెక్ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సభా వేదిక ప్రాంతంలో ప్రాపర్‌గా త్రాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డోన్ మున్సిపల్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ రఘువీర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు.