Andhra Pradesh News: మంత్రి జయరాం సోదరుడు నారాయణ స్వామి సహనం కోల్పోయి ఆస్పరి జెడ్పిటిసి దొరబాబుకు ఫోన్ కాల్ బెదిరింపులకు దిగారు. మంత్రి జయరాంను విమర్శిస్తావా నీ అంత చూస్తాం నిన్ను నరికి చంపేస్తామంటూ హెచ్చిరంచారు. దుర్భసలాడుతూ ఫోన్ చేసి బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


కర్నూలు జిల్లా ఆలూరు ఇన్‌ఛార్జ్‌గా బుసినే విరూపాక్షిని వైసీపీ అధినాయకత్వం నిలబెట్టింది. ఇది స్థానికంగా వైసీపీ లీడర్ల విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. మంత్రి గుమ్మనూరు జయరాం సెగ్మెంట్ వేరే వ్యక్తికి పగ్గాలు ఇవ్వడంతో ఆయన వర్గం చాలా గుర్రుగా ఉంది. ఆయన కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 


ఆలూరు వైఎస్సార్ ఇన్చార్జ్ బుసిని విరుపాక్షి మాత్రం నియోజకవర్గం స్థాయిలో వైఎస్ఆర్ ZPTC , MPP, MPTC నాయకులు కార్యకర్తల ను కలుపుకుని గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. ఆలూరు వైఎస్సార్ ఇంచార్జ్ బుషిని విరుపాక్షి వెంట చాలా మంది కార్యకర్తలు తిరుగుతున్నారు. దీనిపై మంత్రి అనుచరులు కారాలుమిరియాలు నూరుతున్నారు. 


ఓ అడుగు ముందుకేసిన మంత్రి సోదరుడు నారాయమ స్వామి సహనం కోల్పోయి బూతులు తిట్టడం బెదిరించడం ప్రారంభించారు. ఆస్పరి మండలం వైఎస్సార్ జడ్పిటిసి దొరబాబుకు ఫోన్ చేసి నోటికి వచ్చిన భాషలో రాయలేని విధంగా తిట్లదండకం అందుకున్నారు. రెండు నెలలు ఆగు నిన్ను నరికేస్తామంటూ ఫోన్‌లోనే బెదిరింపులకు పాల్పడ్డారు. 


జెడ్పిటిసి దొరబాబు దళితుడు అయినందుకు మంత్రి జయరాం సోదరులు  దూషించారంటూ మండిపడుతున్నారు. విషయాన్ని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు బి.వి.రామారావు దృష్టికి తీసుకెళ్లుతారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.