Srisailam MLA Attack Case: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే శ్రుతిమించి ప్రవర్తిస్తున్న ఘటన తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో పారెస్టు అధికారులపై ఎమ్మెల్యే దాడి చేయడం సంచలనంగా మారింది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయిన విషయం తెలిసింది. ఇప్పుడు దీన్ని డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. దీంతో ఆయన ఆదేశాల మీద ఎమ్మెల్యేతోపాటు జనసేన నేతలపై కేసులు పెట్టాలని ఆదేశించారు. 

మంగళవారం అర్థరాత్రి చిన్నారుట్ల బీట్ సమీపంలో శిఖరం చెక్‌పోస్టు వద్ద వాహనాలు ఆగిన విషయాన్ని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌ రామానాయ్‌, బీట్‌ ఆఫీర్లు మోహన్ కుమార్, గురయ్య, డ్రైవర్ కరీం గమనించారు. రోడ్డుపై వాహనాలు ఉన్న విషయంపై ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, తన అనుచరులు రెచ్చిపోయారు. టైగర్‌ జోన్‌లోకి అర్థరాత్రి వాహనాలు పంపకూడదని చెప్పినా వినిపించకోకుండా వారిపై దాడి చేశారు. ఐడీ కార్డులు, ఆధార్‌కార్డులు, ఫోన్‌లు లాక్కున్నారు. వారిని వాహనాల్లో ఎక్కించుకొని వెళ్లిపోయారు. వారిని శ్రీశైలం అతిథి గృహంలో బంధించారు. అక్కడి జనసేన నాయకుడు అశోక్‌కుమార్, మరికొందరు ఎమ్మల్యే అనుచరులు వచ్చి రచ్చ చేశారు. వారిపై మరోసారి దాడి చేశారు. వేకువ జామున వారిని విడిచిపెట్టారు. 

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ఆయన అనుచరులు చేసిన రచ్చ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు సీరియస్ అయ్యారు. తప్పు ఎవరు చేసినా కేసులు పెట్టాలని ఆదేశించారు. దీంతో ఘటనపై శ్రీశైలం వన్‌ టౌన్‌పోలీస్‌స్టేషన్‌లో అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, జనసేన నేత అశోక్‌ కుమార్‌పై కేసు పెట్టారు. ఇందులో అశోక్‌ను A1గా పేర్కొంటే... ఎమ్మెల్యేను A2గా కేసు రిజిస్టర్ చేశారు. 

ఈ ఉదయం అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌తో కూడా అటవీశాఖాధికారులు సమావేశమయ్యారు. ఆ రోజు జరిగిన దాడి వివరాలు వెల్లడించారు. పవన్‌ను కలిసిన వారిలో అటవీ అధికారులతతోపాటు అసోసియేషన్ నాయకులు కూడా ఉన్నారు. వారి వాదన విన్న పవన్ కల్యాణ్‌ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ఏ పార్టీ నేతలు ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు.