Kanna On GVL : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కన్నా లక్ష్మినారాయణ చిన్నపాటి కలకలం రేపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. తర్వాత కామ్ అయిపోవడం కొంత కాలంగా జరుగుతోంది. తాజాగా ఆయన మరోసారి సొంత పార్టీ నేత జీవీఎల్ నరసింహారావుపై మండిపడ్డారు. కాపు సంఘాలతో జీవీఎల్ నరసింహారావు  సన్మానాలు చేయించుకుంటున్నారని.. కాపులకు ఆయనేం చేశారని ప్రశ్నించారు. గతంలోనూ  ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై కన్నా లక్ష్మినారాయణ విమర్శలు చేశారు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీలో సంచలనం అయింది. 


కాపు సంఘాలతో జీవీఎల్ సన్మానాలు చేయించుకోవడంపై కన్నా ఆగ్రహం


ఇటీవల విశాఖలో  కాపు సంఘాల నేతృత్వంలో జరిగిన సమావేశంలో  జీవీఎల్ నరసింహారావుకు సన్మానం చేశారు. పార్లమెంట్‌లో కాపు రిజర్వేషన్ల అంశంపై జీవీఎల్ ఓ ప్రశ్న  వేశారని  ఈ సన్మానం చేశారు.  కేంద్రం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసింది.  ఇక సర్టిఫికెట్లు జారీ చేయడమే మిగిలి ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రిజర్వేషన్లు చెల్లవని క్యాన్సిల్ చేసింది.   ఈ అంశంపై పార్లమెంట్‌లో జీవీఎల్ ఓ ప్రశ్న అడిగారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్లు చెల్లుతాయా అని ప్రశ్నించారు. అవి చట్టబద్దంగానే ఉన్నాయని చెల్లుతాయని కేంద్రం సమాధానం ఇచ్చింది.  అలా తాను ప్రశ్న అడిగినందుకే ఆ సమాధానం వచ్చిందని జీవీఎల్ నరసింహారావు కాపు సంఘాలతో సన్మానాలు చేయించుకున్నారని  బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఇది కన్నా లక్ష్మినారాయణకు కోపం తెప్పించిందని చెబుతున్నారు.  


కాపు రిజర్వేషన్ల అంశాన్ని వైఎస్ తెరపైకి తెస్తే.... చంద్రబాబు పూర్తి చేశారు !     
 
గుంటూరులో మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మినారాయణ  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని..  ఆర్థిక, సామాజిక పరిస్థితులపై అధ్యయనం  చేశారన్నారు. చంద్రబాబు ఈ రిజర్వేషన్లను పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లను ప్రభుత్వం తొలగించిందని.. కన్నా చెప్పకనే చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటా కిందకాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని ఆయన డి్మాండ్ చేస్తున్నారు.  జనసేన విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలపైనా కన్నా అభ్యంతరం వ్యక్తం  చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ .. తన నిర్ణయాలను తాను తీసుకోనివ్వాలని ఇతరులు ప్రభావితం చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారని స్పష్టం చేశారు.   


బీజేపీ కార్యక్రమాల్లో ఇటీవల పాల్గొనని కన్నా లక్ష్మి నారాయణ    


కన్నా లక్ష్మినారాయణ బీజేపీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన జాతీయ కార్యవర్గ సమావేశాలకు వెళ్లలేదు. తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ వెళ్లలేదు. దీంతో ఆయన జనసేన లేదా టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే కన్నా వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవల బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన  ప్రతినిధి ఆయనతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఇలా మళ్లీ జీవీఎల్ పై బహిరంగ విమర్శలు చేయడం బీజేపీలో కొత్త చర్చకు కారణం అవుతోంది.