Kanipakam Temple EO: కాణిపాకం అభిషేకం టికెట్ ధరల విషయంలో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే ఆలయ ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు పడింది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈఓగా కర్నూల్ ఇన్ ఛార్జీ డిప్యూటీ కమిషనర్ రాణా ప్రతాప్ ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ ఇన్ ఛార్జీ ఈఓగా పని చేస్తున్న్ సురేష్ బాబును రాజమహేంద్రవరం ఆర్జేసీ(రీజనల్ జాయింట్ కమిషనర్) గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


స్వామి వాలి ఆళయంలో అభిషేకం టికెట్ ధరను 700 రూపాయల నుంచి ఏకంగా 5 వేలకు పెంచాలని దేవాదాయ శాఖ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసు బోర్డులో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం, సామాన్యుడ్ని దేవుడి సేవలకు దూరం చేస్తారా అనే విమర్శలు రావడంతో సురేష్ బాబును ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. 


స్వయంభుగా వెలసిన వినాయకుడి ఆలయ చరిత్ర..


సత్యప్రమాణాలకు నెలవైన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారు స్వయం వ్యక్తమై ఓ బావిలో వెలసిన దివ్య క్షేత్రం కాణిపాకం. దేశంలోని వినాయకుడి ఆలయాల్లో కాణిపాకం ఆలయంకు ఎంతో ప్రసిద్ది. ఇక్కడ వెలసిన స్వామి వారు భక్తుల కోర్కెలను తీర్చే కొంగుబంగారమై బాసీలుతున్నారు. చిత్తూరు జిల్లాలోని బహుదా నది తీరంలో వెలసిన లంబోదరునికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. ఒక్కోక్కరు ఒక్కో వైకల్యంతో జన్మించారు. అందులో పెద్దవాడికి కళ్ళు కనపడవు,  రెండవ వాడికి మాటలు రావు. చివరి వాడు చెవిటివారిగా జన్మించారు. కొన్నాళ్లకు ఆ ఊరిలో తీవ్రమైన కరువు తాండవిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు సంక్షోభంతో అల్లాడి పోయారు.


ఆహార కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడుతుంది. ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమకున్న స్థలంలో ఒక బావిని త్రవ్వాలని భావించి, ముగ్గరు అన్నదమ్ములు బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు తగిలింది. అడ్డుగా ఉన్న బండరాయిని పెకళించడానికి ముగ్గురు అన్నదమ్ములు అనేక ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో రాయికి పార తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడింది. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పగా, పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందటా, అలా విహారపురికి కాణి పారకమ్‌ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది పురాణాల ద్వారా తెలుస్తోంది.


అంతకంతకు విఘ్నేశ్వరుడు ఎలా పెరుగుతున్నాడంటే..?


కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారు స్వయంగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది మూలవిరాట్. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన ఆలయంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం పేరొందింది. బావిలో ఉద్భవించిన వినాయకుడు పెరుగుతూ వస్తున్నాడు. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007  సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు. వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్ష పడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతో పాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం.