కాకినాడ జిల్లా పిఠాపురంలో నిన్న మధ్యాహ్నం దొంగతనం జరిగింది. ఓలేటి సువర్చల అనే వృద్ధురాలు తన ఇంటి ముందు చీపురుతో ఊడుస్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ దృశ్యాలను విడుదల చేసి మరీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దొంగలను పట్టిస్తే పది వేల రూపాయల రివార్డు ప్రకటిస్తామని వెల్లడించారు. 


ఈ రివార్డు ప్రకటిచడానికి ముఖ్య కారణం.. సమాజంలో జరిగే అన్యాయాలను అడ్డుకోవడంలో ప్రజలు కూడా పాలుపంచుకోవాలని, దాని వల్ల చాలా వరకు నేరాలు అదుపులోకి వస్తాయని పోలీసులు వివరించారు. తాసు చేసు పనులకు ప్రజలు కాస్త సాయం అందిస్తే పని ఇంకాస్త తొందరగా పూర్తవుతుందని అన్నారు. అందుకే ఈ నజరానా ప్రకటించినట్లు వివరించారు. ఓ వైపు ఆఫర్ ప్రటకించారు, మరో వైపు చైన్ స్నాచర్న్స్ ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. 


బంగారమ్మ గుడెక్కడ అంటూ బంగారం లాక్కెళ్లారు..


వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓలేటి సువర్చల అనే వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం తన ఇంటి ముందు ఊడుస్తుంది. అదే సమయంలో బైక్‌పై అటుగా వచ్చిన ఇద్దరు యువకులు ఆమెతో మాట్లాడారు. బంగారమ్మ గుడికి ఎలా వెళ్లాలంటూ అడ్రస్ అడిగారు. వాళ్లకి అడ్రస్ చెప్పే లోపే... ద్విచక్ర వాహనం వెనకున్న వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసు కాక్కున్నాడు. ముందున్న అతను వెంటనే బండిని స్టార్ట్ చేసి తుర్రుమన్నారు. ఆమె విషయం గుర్తించి మొత్తుకునే లోపే దొంగలు ఉడాయించారు. 


చూస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి..


బాధితురాలు ఓలేటి సువర్చల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పిఠాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దగ్గరలోనే సీసీ టీవీ కెమెరాలు ఉండటంతో ఫుటేజీని పరిశీలించి వృద్ధురాలు సాయంతో నిందితులను గుర్తించారు. చైన్ స్నాచర్స్ ఇద్దరూ బైక్‌పై పరారవుతున్న ఫొటోనే దగ్గర్లోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించడంతోపాటు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చైన్ స్నాచర్స్ ఫొటోలను సోషల్ మీడియాతోపాటు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఉంచి.. వీళ్ల ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల నజరానా ఇస్తామంటూ ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా ఫొటోల్లోని వ్యక్తులను చూస్తే.... 9440796505, 9440796523, 9440796560 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వమని కోరారు.