Avinash Reddy :  వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు.  సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని కూడా చెబుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.  సుప్రీంకోర్టు కేసు విచారణాధికారిని మార్చాలని సోమవారం ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న రాంసింగ్‌నూ కొనసాగించాలని మరో అధికారిని నియమించాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్‌ 10వ తేదీన జరగనుంది. ఈ లోపు అరెస్ట్ చేస్తారేమోనన్న ఉద్దేశంతో అవినాష్ రెడ్డి ముందస్తు  బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. 


వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పైనే ప్రధానంగా సీబీఐ అనుమానం 


వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేసింది.  వైఎస్ అవినాష్‌రెడ్డి, శివశంకర్ రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని సీబీఐ పేర్కొంది. ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికి బదులు తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని తెలిపింది. తనకు ఇవ్వకపోయినా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని పేర్కొంది. వివేకా రాజకీయ కదిలికలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని సీబీఐలో తెలిపింది. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందని పేర్కొంది. హత్య జరిగిన రోజు రాత్రి వై.ఎస్. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ వెళ్లాడని ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్య స్థలానికి వెళ్లాడని తెలిపింది. నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజీ కట్టారని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది.  సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు  అవినాష్ రెడ్డిని విచారించారు.  


కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు  !


ఈ కేసులో నిందితుడయిన  శివశంకర్ రెడ్డి భార్య తలశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తు విషయంలో  ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ధర్మాసనం ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని, హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ‘విచారణ చేసే అధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండి’ అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ రిపోర్టు మొత్తం చదివామని ధర్మాసనం చెప్పింది. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదే అని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి చెప్పారు. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని సూచించింది. ఆ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.