KA Paul : ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఇటు ఎన్డీయే కూటమి ఆదివారం కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోడీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు.  


రెండు చోట్లా డిపాజిట్ గల్లంతు
ఇది ఇలా ఉంటే ఈ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు  కేఏ పాల్ కూడా విశాఖపట్నం పార్లమెంట్, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటిలో దిగిన ఆయనకు 1,700 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఇక్కడ గెలిచారు. విశాఖపట్నం ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసిన ఆయనకు 7,696 (0.55శాతం) ఓట్లు వచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత కేఏ పాల్ ఎన్నికల నిర్వహణ పై సంచలన ఆరోపణలు చేశారు. మోడీ క్యాబినెట్ ఏర్పడనున్న తరుణంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మంచి అవకాశాన్ని పోగొట్టుకున్న చంద్రబాబు, పవన్
కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘నేను ఇచ్చిన సలహా పాటించనందుకు చంద్రబాబు నాయుడు, పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇండియా కూటమితో కలిసి ఉంటే ప్రధాన మంత్రి పదవి దక్కేది, రాష్ట్రానికి  స్పెషల్ స్టేటస్ వచ్చేది, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపగలిగే వాళ్లం.. అన్ని విధాలు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేవి. ఇప్పుడు కుక్కకు రెండు బిస్కెట్లు వేసినట్లు రెండు మంత్రి పదవులు వేశారు బీజేపీ వాళ్లు. వాళ్లకు ఇచ్చింది హెల్త్ మినిస్ట్రీ అంట..  ఆరోగ్యం లేకుండా అందరూ చస్తే మన తెలుగు రాష్ట్రాలకు చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్ర పన్నారు. 


వాళ్లు ఫెయిల్ అయ్యారు
కేఏ పాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను చెప్పిన సలహా విని  240 బీజేపీకి ఉన్నప్పుడే మీరు ప్రధాన పదవిని ఇండియా కూటమి తరఫున చేపట్టి ఉంటే ఆ పార్టీ  జైళ్లో ఎలా పెట్టగలుగుతుంది. వాళ్లు నా సలహా తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు.  రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వనంత వరకు రాష్ట్రంలో ఎవరూ మంత్రి పదవులు తీసుకోకూడదు. స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేసిన తర్వాతే మంత్రి పదవులు చేపట్టాలి. స్పెషల్ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే..  రాష్ట్రానికి వేల కంపెనీలు తీసుకు రావడం.. లక్షల ఉద్యోగాలను కల్పించడం. ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేయడం. వాగ్ధానం చేసిన ప్రకారం తెలంగాణాకు కూడా రావాల్సిన నిధులను విడుదల చేయాలి. అప్పుడు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల వారు మంత్రి పదవులు చేపట్టాలి. అప్పటి దాకా తీసుకోకూడదు. 


ఈవీఎం దయతో గెలిచిన పవన్
‘పవన్ తమ్ముడూ బీజేపీ పుణ్యమాని, ఈవీఎంల దయతో గెలిచావు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకు వచ్చి చూపించు. అప్పుడే నువ్వు రియల్ హీరో అవుతావు.. లేదంటే జీరో అవుతావు. మంత్రి పదవులు కాదు కావాల్సింది రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , జగన్ మోహన్ రెడ్డి అందరం కలుద్దాం. స్పెషల్ స్టేటస్ కోసం ధర్నాలు చేద్దాం. మీరంతా నాతో కలవండి.. మోడీకి పాఠం నేర్పుదాం. తెలుగు సత్తా, ఎన్టీఆర్ సత్తా, పీవీ నరసింహా రావు సత్తా దేశానికి చూపిద్దాం. ప్రపంచానికి చాటి చెబుదాం. ఈవీఎంల ద్వారా ఒక్క ఓటు పడకుండా చేస్తే భయపడి పారిపోతాను అనుకున్నారా.. ఖబద్దార్.. తెలుగు సత్తా చూపిద్దాం. ఏ మంత్రి పదవి తీసుకుంటే ఆయనను భాయ్ కాట్ చేయండి. జైల్లో పెడతారా అది నాకు కొత్త కాదు. కలిసి పోరాడుదాం ఆంధ్రాను అభివృద్ధి చేసుకుందాం’ అని కేఏ పాల్ అన్నారు.