ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్లీ రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అవుతున్నారు. ఈ నెల 16న ఢిల్లీలో మౌన దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. అందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులను కూడా ఆహ్వానించారు. తనతో కలిసి మౌన దీక్షలో పాల్గొనాలని బంపర్ ఆఫర్ ఇచ్చారు! ఏపీ, తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ఢిల్లీలో ఈ దీక్ష చేస్తున్నట్లు పాల్ చెప్పారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలనే డిమాండ్ తో 16న రాజ్‌ఘాట్‌లో గాంధేయమార్గంలో మౌనదీక్ష ద్వారా నిరసన తెలియజేస్తానని పాల్ వెల్లడించారు. ఈ మౌన దీక్షకు సీఎంలు, మంత్రులనే కాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్, కోదండరాం సహా అన్నిపార్టీల నేతలను ఆహ్వానించినట్టు కేఏ పాల్ తెలిపారు.


ఢిల్లీలో మౌన దీక్షకు వచ్చేందుకు అవసరమైతే ముఖ్యమంత్రులకు, పెద్దలకు ప్రత్యేక విమానాలు కూడా పంపిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తెలంగాణకు అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలని పాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సత్తా కేంద్రానికి చూపిద్దామన్నారు.


Also Read: Godavari Floods: ఆ వరదలతో ఒక తరమంతా నాశనం! తలచుకుంటేనే వెన్నులో వణుకు - దాంతో పోలిస్తే ఇవి వరదలే కావు!


జగన్ సీబీఐ కేసులకు భయపడి రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు ఇస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. జగన్ 8 లక్షల కోట్లు అప్పు చేశారని, ఏపీ రాష్ట్రానికి ఒక్క కంపెనీనిని కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. 


కేసీఆర్ పైన కూడా కేఏ పాల్ విమర్శలు చేశారు. కేసీఆర్ బీజేపీకి బీ - టీం గా మారారని అన్నారు. బండి సంజయ్ ప్రధాని మోదీని దేవుడిగా కీర్తిస్తున్నారని, బండికి దేవుడు ఎలా ఉంటాడో తెలుసా అని కేఏ పాల్ నిలదీశారు. 



ఇటీవలే కేఏ పాల్ ఏపీ కారు యాత్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘పాల్‌ రావాలి-పాలన మారాలి’’ అనే నినాదంతో ఏపీలో ప్రకటించారు. శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించడానికి కేఏ పాల్ సన్నాహాలు చేస్తున్నారు. మధ్యలో బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. ఏపీలో ముగిశాక, తెలంగాణలోనూ మొదలుపెట్టనున్నారు.


Also Read: Trains Cancellation Schedule: నేటి నుంచి ఈ రైళ్లు క్యాన్సిల్, 34 ఎంఎంటీఎస్, 15 ఇతర ట్రైన్స్ - లిస్ట్ ఇదీ