JD Lakshmi Narayaa :    అవసరమైతే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు ఆయన విశాఖ నుంచే  పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. అయితే ఏ పార్టీలోనూ ఆయన చేరే అవకాశం లేకపోవడంతో సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలోకి చవచ్చారు.  అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతాన్నారు. రానున్న ఎన్నికల్లో తాను మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.  విశాఖలో  మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క(శిరీష)కు మద్దతుగా ఆలంపూర్ సీట్లో ప్రచారం చేసి వచ్చిన ఆయన.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్నారు. ఫేక్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందే అని అన్నారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.              


2019 పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ నుంచి పార్లమెంట్ కు పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తున్నరన్న కారణం చూపి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత స్వచ్చంద సంస్థ పెట్టుకుని వ్యవసాయ అంశాలపై పని చేస్తున్నారు. విశాఖలోనే మళ్లీ  పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన  పలు అంశాలపై స్పందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేసు వేసి పోరాడుతున్నారు. అయితే ఆయన అన్నిపార్టీలనూ పొగుడుతూండటంతో ఎప్పటికప్పుడు ఆయన ఫలానా పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతూ వస్తోంది.                


బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ఏపీ అధ్యక్ష పదవి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కేసీఆర్ నిర్ణయాలను పలుమార్లు ప్రశంసించారు. కానీ తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించారు. ఓ సారి వైసీపీ అధినేత ను కూడా ప్రశంసించారు. దాంతో ఆయన వైసీపీలో కూడా చేరుతారని  ప్రచారం జరిగింది. కానీ ఆ విషయాన్నీ ఆయన ఖండించారు. టీడీపీలో చేరే విషయంపై ఎప్పుడూ రూమర్స్ రాలేదు కానీ మళ్లీ జనసేనలో చేరుతారన్న చర్చ అయితే జరిగింది. కానీ పవన్ ఆయనను ఆహ్వానించలేదు...  ఆయన కూడా పవన్ ను పార్టీలోకి  వస్తానని అడగలేదు. ఈ కారణంగా పెండింగ్ పడిపోయింది. చివరిగా ఆయన సొంత పార్టీ ఆలోచన చేస్తున్నారు.                       
  
విశాఖలో జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫేర్‌లో 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు.సెలెక్ట్ అయిన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లను ఇస్తామని వెల్లడించారు. పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్నవారు జాబ్ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. కొంచెం వెనుకబడిన అభ్యర్థులకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తామని తెలిపారు.