Japanese diplomats are impressed with Andhra Meals:  జపాన్ దౌత్యవేత్తలు మన తెలుగు వంటకాల రుచికి ఫిదా అయిపోయారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో జపాన్ ఎంబసీ బృందం  సందడి చేసింది. పూర్తిగా దేశీ స్టైల్‌లో, అచ్చమైన ఆంధ్ర రుచులను ఆస్వాదిస్తూ వారు చేసిన విందు భోజనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘాటైన మసాలాలు, నోరూరించే ఆవకాయ, పప్పు, సాంబార్‌లతో నిండిన  ఆంధ్ర థాలీ ని చూసి వారు ఆశ్చర్యపోవడమే కాకుండా, ఆ రుచులను అమితంగా ఇష్టపడ్డారు.

Continues below advertisement

ఆంధ్ర భోజనంలోని వైవిధ్యాన్ని, ముఖ్యంగా ఆ ఘాటును జపాన్ బృందం ఎంతో ఎంజాయ్ చేసింది. భోజనం అనంతరం తమ అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తెలుగు వంటకాల్లోని బోల్డ్ ఫ్లేవర్స్ తమకు బాగా నచ్చాయని ప్రశంసించారు. కేవలం ఫోటోలు పెట్టడమే కాకుండా, తెలుగు సంస్కృతిపై తమకున్న గౌరవాన్ని చాటుకుంటూ తెలుగులోనే ధన్యవాదాలు అని ట్వీట్ చేయడం విశేషం. ఇది తెలుగు భాష పట్ల,  ఇక్కడి ఆతిథ్యం పట్ల వారికి ఉన్న మక్కువను చాటిచెప్పింది.

ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణకు, సున్నితమైన రుచులకు పేరుగాంచిన జపాన్ దేశ ప్రతినిధులు, మన ఆంధ్ర భోజనాన్ని ఇంతలా మెచ్చుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం. విదేశీ ప్రతినిధులు స్థానిక సంస్కృతిని, ఆహారపు అలవాట్లను గౌరవించడం అనేది రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్ర వంటకాల ఘాటును కూడా తట్టుకుని, వారు అంత ఇష్టంగా భోజనం చేయడం చూస్తుంటే.. ఆంధ్ర రుచి - అమోఘం  అని మరోసారి నిరూపితమైంది.                               

Continues below advertisement

జపాన్ ఎంబసీ బృందం చూపిన ఈ చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తెలుగు ఆవకాయ ముద్దను, నెయ్యి వేసిన పప్పును రుచి చూసిన తర్వాత ఎవరైనా సరే తెలుగు రుచులకు దాసోహం కావాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. మన సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పేలా ఉన్న ఈ విందు ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.