Pawan Kalyan suffering from Recurrent influenza: అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల త్వరగా అస్వస్థతకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒకట్రెండు రోజుల్లోనే జ్వరం వచ్చి ఆయన స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారని తెలిసిందే. రెండు రోజులు ప్రచారం చేస్తే జ్వరం వచ్చి పవన్ పిఠాపురం వదిలి హైదరాబాద్‌కు వెళ్తారని అధికార వైసీపీ నేతలు ఆయనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాగా, పవన్ కళ్యాణ్‌కు ఎందుకు ఇలా జరుగుతుంతో జనసేన పార్టీ (Janasena Party) ఓ ప్రకటనలో ఆయన అనారోగ్య సమస్యను వెల్లడించింది. రికరెంట్ ఇన్‌ఫ్లుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి రోజూ ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. 




పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ జాగ్రత్తలు పాటించాలి.. 
జనసేనాని పవన్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయవద్దు అని పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రేజ్ గజమాలలు ఏర్పాటు చేయవద్దని, అదే విధంగా కరచాలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. పూలు జల్లినప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు  విజ్ఞప్తి చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయభేరీ యాత్ర నేటి (ఏప్రిల్ 20) నుంచి నిరాటంకంగా కొనసాగుతుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ముజేరడంతో పవన్ జ్వరంతో  బాధపడుతున్నారని తెలిసి అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్ అవుతున్నారు. 


పిఠాపురంలో కేవలం పోటీ చేస్తున్నది తాను మాత్రమే కాదని, వర్మ సైతం బరిలో ఉన్నట్లేనని పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో తాను గెలిస్తే వర్మ గెలిచినట్లే అని, వ్యక్తిగత విజయం కంటే కూటమి విజయం ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. యు.కొత్తపల్లిలో పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఎన్నికల్లో మూడు పార్టీలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు భావించాలని అప్పుడే కూటమి లక్ష్యం నెరవేరుతుందన్నారు.