Pawan Kalyan New House In Pithapuram: తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని.. త్వరలోనే పిఠాపురంలో (Pithapuram) ఇల్లు తీసుకుంటానని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తాజాగా, పిఠాపురంలో ఆయన కొత్త ఇల్లు రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కార్యాలయం, వసతికి అనువుగా చేబ్రోలులో ఓ భవంతి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఉగాది రోజు పవన్ గృహ ప్రవేశం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నట్లు సమాచారం. ఈ మూడంతస్తుల భవనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేనతో పొత్తులో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. ఇక, అధికార వైసీపీ ఇక్కడ వంగా గీతను బరిలోకి దించింది. పెద్ద ఎత్తున మంత్రులు, కీలక నేతలను అక్కడ ప్రచారం కోసం మోహరించింది. అటు, అధికార వైసీపీ ఎన్ని చేసినా తాను పిఠాపురంలో గెలిచి తీరుతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తున్నారు.






ప్రచారం అప్పటి నుంచే..


అయితే, పవన్ కల్యాణ్ ఇటీవల జ్వరం బారిన పడటంతో తాత్కాలికంగా ప్రచారాన్ని నిలిపేశారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో మళ్లీ ఆదివారం నుంచి ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా పవన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పిఠాపురం తర్వాత ఆయన తెనాలిలో ప్రచారం చేయాల్సి ఉంది. ఉత్తరాంధ్ర  పర్యటన తర్వాత తెనాలి సభలో ప్రసంగించే అవకాశం ఉంది. 


అటు, టీడీపీ - బీజేపీ - జనసేన పార్లమెంటు స్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి కూటమి కార్యాచరణను రూపొందించుకోనున్నారు. ఎన్నికలు సన్నద్ధత, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో నివసించే ఓటర్లు, పోస్టల్ ఓట్లు, బూత్ ఏజెంట్ లు తదితర అంశాలపై చర్చించనున్నారు. కూటమి తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో ఎంపీ, ఎమ్యెల్యే అభ్యర్థులు ప్రచారంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీ అభ్యర్థి మేనిఫెస్టో ఇతర స్థానిక సమస్యలపైనా చర్చించనున్నారు. కూటమి పార్లమెంట్​ స్థాయి అభ్యర్థులు, పార్టీ అధ్యక్షులు పాల్గొనున్నాంట్లు సమాచారం. అంతే కాకుండా 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు, 7 నియోజకవర్గ ఇన్​ఛార్జీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.     


Also Read: Kadapa News: బీజేపీ బానిస జగన్‌- వైఎస్‌ వారసుడు ఎలా అవుతారు? బస్‌ యాత్రలో షర్మిల ఘాటు వ్యాాఖ్యలు