Janasena Chief Pawan Kalyan: ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. ప్రధాన పార్టీలన్నీ సీట్ల సర్దుబాటు మొదలుపెట్టాయి. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేగం పెంచారు. ఇప్పటికే వారాహి విజయయాత్ర తొలి విడత పూర్తి చేశారు. ప్రస్తుతం రెండో విడత విడత వారాహి యాత్రలో వైసీపీ నేతల్ని కాదు సీఎం జగన్ మోహన్ రెడ్డినే టార్గెట్ చేశారు. మరోవైపు పార్టీలో చేరికలపై సైతం పవన్ ఫోకస్ చేస్తున్నారు. విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అధికార పార్టీని వీడి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గానికి టి.వి.రామారావులను నియమించారు. టి.వి రామారావు గతంలో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. ఈ ముగ్గురికీ పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. అదే విధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి(కార్యక్రమాల నిర్వహణ కమిటీ)గా ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ను నియమిస్తూ నియామక పత్రం అందచేశారు. నూతనంగా నియమితులైన వారికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రజలకు అవిరళమైన సేవలు అందించాలని, పార్టీ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఇప్పటి వరకు రాజానగరం ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన మేడా గురుదత్, పిఠాపురం ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన మాకినీడు శేషుకుమారిలకు పార్టీలో మరో ముఖ్య పదవి అప్పగిస్తామని, వారి సేవలు పూర్తి స్థాయిలో పార్టీకి వినియోగించుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి Join Us on Telegram: https://t.me/abpdesamofficial