Jaggayyapeta News : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోస్టల్ సిబ్బంది అలసత్వం బహిరంగంగా బట్టబయలైంది. పట్టణ ప్రజలకు అందించాల్సిన ఒరిజినల్ ఆధార్ కార్డులు, పెళ్లి కార్డులు, బ్యాంకు లెటర్స్, వివిధ ప్రభుత్వ శాఖలకు చేర్చాల్సిన లేఖలు బట్వాడా చేయకుండా తొర్రగుంట పాలెం ఆర్టీవో ఆఫీస్ వెనక ముళ్లకంపలలో పడేశారు. వీటిలో లాయర్ నోటీసులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన ప్రసాదాలు, నిరుద్యోగులు డబ్బుతో కొనుక్కునే స్టడీ మెటీరియల్, సుమారు రెండు వందల ఒరిజినల్ ఆధార్ కార్డులు, ఇలా ఎన్నో రకాల రిజిస్టర్ పోస్టులు ఉన్నాయి. రిజిస్టర్ పోస్ట్ లకు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసే పోస్టల్ శాఖ ప్రజల అడ్రస్ కు చేర్చకుండా ముళ్లకంపలో పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, వీటన్నిటిని ప్రజలకు చేర్చాలని పలువురు కోరుతున్నారు.