జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


సన్నాహకాలపై జగన్ సమీక్ష... 
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వాహణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అర్జీల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై జగన్ అధికారులతో సమగ్రంగా చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి, అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంత వరకూ ట్రాక్‌ చేయాలని స్పష్టం చేశారు. అందిన అర్జీలపై ప్రతి వారం ఆడిట్‌ చేయాలని, దీనిపై ప్రతి వారం నివేదికలు కూడా తీసుకోవాలన్నారు. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా.. లేదా అన్నదానిపై ప్రతి వారం సమీక్ష జరగాలని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరగలమని అన్నారు.


కాల్ సెంటర్లకు అనుసందానం...
వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్‌ సెంటర్లను అనుసంధానం చేయాలని, వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారం కోసం ఇప్పటివరకూ ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి, తిరిగి పునర్నిర్మాణం చేయాలన్నారు. సీఎంఓ తో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ విభాగాలు ఉండాలన్నారు. అంతే కాదు జిల్లా స్థాయిలో నూ, మండల స్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి మానిటరింగ్‌ యూనిట్లు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మానిటరింగ్‌ యూనిట్లు సమర్థవంతంగా పని చేస్తేనే కార్యక్రమం సక్సెస్ రేట్ ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. స్పందనకు అత్యంత సమర్థవంతమైన, మెరుగైన విధానమే.. జగనన్నకు చెబుదాం కార్యక్రమమని అన్నారు.


సహనం.. ఓపిక.. పునఃపరిశీలన...
సంబంధిత విభాగంలో సరిగ్గా పని జరగలేదనే కారణంతో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు వస్తాయని, వాటిని పరిశీలించి, సంతృప్తి పరిచేలా పరిష్కారం చూపడం అన్నది సవాల్‌తో కూడుకున్నదని జగన్ అన్నారు.సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధానాల పునర్నిర్మాణాలతో ముందుకు సాగాలని వ్యాఖ్యానించారు. స్పందన డేటా ప్రకారం అత్యధికంగా ఫిర్యాదులు రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం – కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయని అన్నారు. జగనన్నకు చెబుదాం ప్రారంభమైన తర్వాత ఇవే విభాగాల నుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ శాఖలకు చెందిన విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టిపెట్టాల్సి ఉంటుందని చెప్పారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్‌ ఇవ్వాలన్నారు.


మానిటరింగ్ యూనిట్లు కీలకం... 
మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటు పై కూడా మార్గదర్శకాలు రూపొందించాలని జగన్ అన్నారు. నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలని, ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యమని జగన్ అధికారులతో అన్నారు. పరిష్కారం అయిన తర్వాత వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలని సూచించారు. తిరస్కరణకు గురైనప్పటికి, జరిగిన ప్రక్రియ పై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా అధికారుల పని తీరు ఉండాలని సూచించారు. అవినీతికి సంబంధించి అంశాలను గట్టిగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలన్నారు.