Jagan questions Chandrababu on implementation of schemes: దీపావళి సందర్భంగా  వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి .. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. 

1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి

2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000

3.50 ఏళ్లకే పెన్షన్‌, నెల నెలా రూ.4వేలు.

4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్‌ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట 

5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000

6.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు

7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…

8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలుఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?

వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా.

మా వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులని  మండిపడ్డారు.   

 

 లండన్ పర్యటనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి స్వదేశానికి తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ లో ఇలాంటి అంశాలపై పోస్టులు పెట్టలేదు. కోర్టు అనుమతితో కుటుంబసభ్యుల వద్దకు వెళ్లిన ఆయన  తిరిగి ఇండియాకు  వస్తున్నట్లుగా.. ఆ పార్టీ నేత అబ్బయ్య చౌదరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు  చేయడంతో.. ఆయన ఇండియాకు వచ్చినట్లుగా భావిస్తున్నారు.