Intelligence Wing Key Suggestions On CM Jagan Security: సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటన నేపథ్యంలో ఆయన భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. గుత్తిలో జగన్ కాన్వాయ్ పై చెప్పులు.. ఇప్పుడు రాళ్లు విసరడంతో హైఅలర్ట్ ప్రకటించింది. సభల్లో ర్యాంప్ వాక్ చెయ్యొద్దని జగన్ కు భద్రతాపరమైన సూచనలు చేసింది. జగన్ బస్సు పరిసరాల్లోకి అనుమతిపై ఆంక్షలు విధించనున్నారు. జగన్ కు, జనానికి మధ్య బారికేడ్లు ఉండాలని భద్రతా సిబ్బందికి నిఘా వర్గాలు సూచించాయి. క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలు తగ్గించాలని.. వీలైనంత వరకూ బస్ లో కూర్చునే రోడ్ షోలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్ధం విధించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరీ అవసరమైతేనే జగన్ బస్సుకు దగ్గరగా నేతలు, కార్యకర్తలను అనుమతించాలని చెప్పింది. ఇకపై జగన్ పర్యటనలు, రోడ్ షోలు, పాల్గొనే సభల్లో భద్రతా వైఫల్యాలు లేకుండా చూడాలని సిబ్బందికి స్పష్టం చేసింది.


సీఈసీ ఆరా


మరోవైపు, సీఎం జగన్ పై దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. వీఐపీల భద్రతలో వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇటీవల చిలకలూరిపేటలోని ప్రధాని సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది. అప్పుడు ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. తాజాగా, సీఎం జగన్ రోడ్ షోలో జరిగిన ఘటనపైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 


ఎన్నికల సంఘానికి నివేదిక


అటు, సీఎం జగన్ పై దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సీపీ కాంతిరాణా నివేదిక ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తునకు 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి రాయితో దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ, డ్రోన్ విజువల్స్ జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా.. సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి సీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు. 


దర్యాప్తు ముమ్మరం


మరోవైపు, సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి ఘటనపై అజిత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ స్థాయి అధికారులతో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు కాగా.. నిందితుల కోసం గాలింపు తీవ్రం చేశారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. సీసీ ఫుటేజీ, డ్రోన్ విజువల్స్ ను జల్లెడ పడుతున్నారు. అటు, వెల్లంపల్లి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. స్థానికంగా ఓ స్కూల్ భవనం, గంగానమ్మ గుడికి మధ్యలో చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కుడివైపు జనావాసాలు ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని నిందితుడు ఎంచుకున్నట్లు గుర్తించారు. పూర్తిగా చీకటి, చెట్లు ఉండడంతో ఎవరికీ కనిపించకుండా.. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని నిందితుడు ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 30 అడుగుల దూరం నుంచి రాయిని బలంగా విసిరినట్లు తెలుస్తోంది. కాగా, శనివారం రాత్రి విజయవాడలో బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా.. సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. 


Also Read: Kodali Nani: జగన్‌ను రాళ్లతో కొట్టాలని నిన్న బాబు కామెంట్స్, వెంటనే సీఎంపై దాడి - కొడాలి నాని,