AP CID At Narayana House : హైదరాబాద్ లోని మాజీ మంత్రి నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో అవకతవకలపై సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11.30 నుంచి సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోంది.  సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నారాయణకు ఇప్పటికే సీఐడీ నోటీసులు ఇచ్చింది.  నారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారని,  ఇటీవల ఆయన శస్త్రచికిత్స చేసుకున్నారని సీఐడీ విచారణకు హాజరు కాలేరని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అయితే నారాయణను హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలోనే విచారించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేయనుంది సీఐడీ.  


రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు 


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా సీఐడీ చేర్చింది. 120బి, 34, 420, 36, 37, 166 సెక్షన్ల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదులో 2014-19 మధ్య అమరావతి రాజధాని భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో మార్పుతో రామకృష్ణ హోసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది చేకూరేలా చేశారని ఆరోపించారు. ఈ కేసులో నారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  అయితే ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 


పదో తరగతి పేపర్ల లీక్ కేసు 
 
టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో  నారాయణకు కింది కోర్టు ఇచ్చిన  బెయిల్‌ను  చిత్తూరు జిల్లా కోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో చిత్తూరు జిల్లాలోని నెల్లేపల్లి హైస్కూల్ లో లీకైన టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో దర్శనమిచ్చింది. దీని వెనుక నారాయణ హస్తం ఉన్నట్టు చిత్తూరు జిల్లా పోలీసులు ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనను కోర్టులో హాజరు పర్చగా, నారాయణ 2014లోనే నారాయణ సంస్థల అధినేతగా తప్పుకున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిల్ ను చిత్తూరు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దు చేసింది.  నవంబరు 30వ తేదీ లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. 


నారాయణపై కక్ష సాధింపు 


అసలు ఇన్నర్ రింగ్‌రోడ్డే లేదని ఇక అలైన్‌మెంట్ మార్పు ఎక్కడిదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క గజం కూడా భూసేకరణ జరగని ప్రాజెక్టులో అవకతవకలు ఏమిటని ప్రశ్నిస్తోంది. అలాగే టెన్త్ పేపర్ లీక్ కాలేదని ప్రభుత్వం చెబుతూ.. నారాయణపై లీక్ కేసులు పెట్టడం ఏమిటని  ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం తీరుపై న్యాయస్థానాల్లో ఎండగడతామని టీడీపీ అంటోంది.