Hindupur News :   రాజకీయాలంటే ఎప్పుడూ ఏదో ఒకటి హడావుడి చేస్తూండాలి ..లేకపోతే జనం మర్చిపోతూంటారు. ఈ అంశంలో సెలబ్రిటీ ప్రజాప్రతినిధులున్న చోట ఇతర పార్టీల వారికి చాలా వెసులుబాటు ఉంటుంది. కొన్ని రోజులు ప్రజాప్రతినిధి కనిపించకపోతే వెంటనే  పోలీస్ స్టేషన్‌కు వెళ్లి .. ఓ ఫిర్యాదు ఇస్తే చాలు కావాల్సినంత ప్రచారం. హిందూపురంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు అదే చేశారు.   హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించుటలేదని, మా సమస్యలు  ఎవరితో చెప్పుకోవాలని హిందూపురానికి చుట్టపు చూపుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడుటలేదని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే నేరుగా  కాకుండా ఈ సారి కొత్త పంధాలో వెళ్లారు. కొంత మంది  హిజ్రాలతో కంప్లైంట్లు ఇప్పించారు. వారికి మద్దతుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.  


బాలకృష్ణ కనిపించడం లేదంటున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు


వైఎస్ఆర్‌సీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడ ఉన్నా ..  సమస్యల పరిష్కారం విషయంలో ఆయన శ్రద్ధ చూపిస్తున్నారని చెబుతూ  ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బాలకృష్ణపై వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లోకి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దూసుకు రావడంతో గందరగోళం ఏర్పడింది.  హిందూపురంలో  వైఎస్ఆర్‌సీపీ తరపున ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ ఇక్బాల్ వ్యవహరిస్తున్నారు. మాజీ పోలీసు అధికారి అయిన ఆయన నాన్ లోకల్. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఓ వర్గం ఆయనకు దూరంగా ఉంటుంది.  తన వర్గం నేతలతోనే ఐయన బాలకృష్ణపై పోరాటం చేస్తూంటారు. 


షూటింగ్‌ల్లో బిజీగా ఉంటున్న బాలకృష్ణ


హిందూపురం నుంచి గెలిచిన బాలకృష్ణ .. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన పీఏలు ఎక్కువగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు. బాలకృష్ణ అప్పుడప్పుడూ పర్యటిస్తూంటారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వివిధ సందర్భాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆస్పత్రులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం అన్న క్యాంటీన్, సంచార ఆస్పత్రి వంటివి ఏర్పాటు చేశారు. అయితే ఆయన స్థానికంగా నివాసం ఉండరు. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. బాలకృష్ణ తరపున టీడీపీ యంత్రాంగం రాజకీయ పోరాటం చేస్తూ ఉంటుంది. 


బాలకృష్ణ ప్రత్యర్థి .. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా స్థానికేతరుడే 


రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ  బాలకృష్ణ సినిమాలతో  బిజీగా ఉంటారు. మరో వైపు బసవతారకం ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల హిందూపురం జిల్లా కావాలంటే బాలకృష్ణ ఉద్యమం కూడా చేశారు. అభివృద్ధి  పనులు..ఇతర అంశాల విషయంలో ఆయన చురుగ్గా వ్యవహరిస్తూంటారు.. కానీ స్థానికంగా ఉండకపోవడం రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది. కొసమెరుపేమిటంటే బాలకృష్ణ కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ  కూడా స్థానికేతరుడే. ఆయన కూడా హిందూపురంలో నివాసం ఉండరు ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగినప్పుడే వస్తారు.