Andhra News :   జగజ్జనని చిట్ ఫండ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,. ఆయన తనయుడు వాసులకు ఏపీ హైకోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో వీరిద్దరిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కొడుకు వాసులు బెయిల్ కోసం ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్నది. బుధవారం ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది.                 

  


చిట్ ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదని అప్పారావు తరపు న్యాయవాదులు వాదించారు. డిపాజిట్ దారుల పిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని వారు గుర్తు చేశారు అయితే ఈ వాదనను సీఐడీ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అప్పారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదిరెడ్డి వాసు భార్య, టిడిపి ఎంపి కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు సోద‌రి భవానీ రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో రాజకీయ కక్షతోనే ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపించింది. గత వారంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటించారు.                   


రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ మారాలని రాజమండ్రి ఎమ్మెల్యే భవానీపై వైసీపీ నాయయత్వం ఒత్తిడి తెచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ మారనందుకే ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం నడుపుతున్న చిట్ ఫండ్ విషయమై కేసులు నమోదు చేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు.                                 


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ ఆదిరెడ్డి కుటుంబానికి చిట్ ఫండ్ కంపెనిపై సీఐడీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఓటింగ్‌కు రాకుండా ఒత్తిడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇదే విధంగా మార్గదర్శి చిట్ ఫండ్ కేసులోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు. పలువురు మార్గదర్శి బ్రాంచి మేనేజర్లను అరెస్ట్ చేశారు. ఆ కంపెనీకి చెందిన ఆడిటర్ ను అరెస్ట్ చేయడం వివాదాస్పదమయింది. చివరికి అందరికీ బెయిల్ వచ్చింది. మార్గదర్శి కేసులో  సీఐడీ ఇప్పటికీ అప్పుడప్పుడూ కొన్ని బ్రాంచ్‌లలో సోదాలు నిర్వహిస్తోంది.