ఐఎండీ అధికారుల అంచనా ప్రకారం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడింది. రేపు అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. తరువాత ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అన్నారు.


దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని అన్నారు. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు ఎల్లుండి నుంచి రెండు రోజు లపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. 


రేపు ఈ జిల్లాల్లోనే వర్షాలు
రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల  మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదని అన్నారు.


మంగళవారం రాత్రి 7 గంటల నాటికి అనకాపల్లి జిల్లా గొలుగొండలో 102 మి.మీ, విశాఖపట్నం రూరల్ లో 77.7 మి.మీ, విజయనగరం జిల్లా పెదనాడిపల్లె, 77 మి.మీ, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 75 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేటలో 70 మి.మీ, కృష్ణా జిల్లా పెడనలో 59.25 మి.మీ అధిక వర్షపాతం, 60 మి.మీ కన్న ఎక్కువ వర్షపాతం 10 ప్రాంతాల్లో నమోదైనట్లు తెలిపారు.


మరోవైపు, ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద రేపటి నుంచి పెరగనున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 39 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.76 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల సంస్థ ఎండీ డా. బిఆర్ అంబేడ్కర్ తెలిపారు. వర్ష ప్రభావంతో వరద ఉధృతి హెచ్చు తగ్గులుగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామని అన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఆరు బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు.