ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ  అశోక్‌బాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అశోక్‌బాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన లోకాయుక్తను కూడా పార్టీగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ధర్మానసం ఆదేశించింది. గురువారం అర్థరాత్రి అశోక్‌బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో  ఉదయం హైకోర్టులో బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 


టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు గతంలో ప్రభుత్వ ఉద్యోగి. ఏసీటీవోగా పని చేస్తూ రిటైరయ్యారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అయితే ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు ప్రమోషన్ల కోసం తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని ఓ ఉద్యోగినిలోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.  బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. లోకాయుక్త ఆదేశాలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేయాలని జనవరి 24వ తేదీన ఆదేశించింది. 


తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్‌ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్‌లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. అశోక్ బాబు పైన సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేశారు. అయితే అశోక్‌బాబుపై ఈ ఆరోపణలు గతంలోనూ ఉన్నాయి. అయితే గత ప్రభుత్వాలు విచారణ జరిపాయి. విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. క్లరికల్ తప్పు కారణంగానే అలా నమోదయిందని అశోక్ బాబు తాను డిగ్రీ చేశానని ఎక్కడా చెప్పలేదని.. ఆ పేరుతో ఆయన ప్రమోషన్లు కూడా పొందలేదని నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతో ఆయనకు ప్రభుత్వం 2018లోనే క్లీన్ చిట్ ఇచ్చింది.


ఆ తర్వాత ఆయన రిటైరయ్యారు. రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు అదే అభియోగాలతో ఓ ఉద్యోగిని లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేయాలని ఆదేశించడం.. అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. అయితే ఇది తప్పుడు కేసు అని.. రాజకీయ ఉద్దేశాలతో పెట్టారని అశోక్ బాబు తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించినట్లుగా ఒక్క ఆధారం కూడా ఎఫ్‌ఐఆర్‌ లోచూపించలేదని టీడీపీ మండిపడింది. ఎన్నికలఅఫిడవిట్‌లోనూ అశోక్ బాబు తన క్వాలిఫికేషన్ ఇంటర్ అనే చెప్పారంటోంది. ఈ కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.