Mlc Dokka Vara Prasad : వైసీపీ అనర్హత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మాజీ మంత్రి, వైసీప ఎమ్మెల్సీ డొక్కా  మాణిక్య వరప్రసాద్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే శ్రీదేవి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని  డొక్కా డిమాండ్ చేశారు. ఆమె ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఏపీలో నిరభ్యంతరంగా తిరగవచ్చని తెలిపారు. క్రాస్ ఓటింగ్ పై సీబీసీఐడీ విచారణ చేయాలని డొక్కా డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎక్కడ ప్రారంభం అయిందో అందరికీ తెలుసన్నారు. ఒకే  దగ్గర  ఈ  కొనుగోళ్లు  జరుగుతున్నాయని టీడీపీ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో  ఇలాంటి అనైతిక చర్యలు ఉండకూడదన్న డొక్కా... ఈడీ కూడా ఈ అంశంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉండవల్లి శ్రీదేవిని ఒక్కరనే సస్పెండ్ చెయ్యలేదని డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన నలుగురిని సస్పెండ్  చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి అమరావతి రైతులు, మహిళలు అంటూ టీడీపీ  నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. టీడీపీకి శ్రీదేవి సహకారం అందించారని చెప్పడానికి ఇంతకన్నా  ప్రూఫ్  కావాలా అన్నారు.  పెద్ద నాయకులను టార్గెట్ చేసి మాట్లాడితే ఉపయోగం ఉండదని ఎమ్మెల్యే శ్రీదేవికి డొక్కా కౌంటర్ ఇచ్చారు. పార్టీ నుంచి బయటకు వెళ్లి ఆమె ఏమైనా చేసుకోవచ్చన్నారు.  


ఇంతకంటే రుజువు ఏం కావాలి? 


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఆఫర్ చేశారని వైసీపీ విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలను బలపరుస్తూ కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని అంటున్నారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలిచారు. దీనిపై అధికార వైసీపీ సీరియస్ అయింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ టీడీపీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుంది. ఓటుకు పది కోట్లు ఆఫర్ చేశారని ఎమ్మెల్యే రాపాక, మద్దాలి గిరి తెలపడంతో...  ఆ పని చేసిన వారిపై కేసులు పెట్టాలని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఓటుకు నోటుతో కలిపి వాళ్లను విచారించాలన్నారు. 1995 నుంచి ఎమ్మెల్యేలను కొనడం జరుగుతోందని విమర్శించారు. పరిశోధనా సంస్థలు ఈ విషయాన్ని క్లూస్ తీసుకుని విచారణ చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొత్తగా టీడీపీ నినాదాలు పలుకుతోందన్నారు. టీడీపీకి సహకరించారనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లి శ్రీదేవికి వచ్చిన స్క్రిప్టు ఏంటో మాకు తెలుసన్నారు.  ఉండవల్లి శ్రీదేవి కులాన్ని, కొందరు పెద్ద వాళ్ల పేర్లు వాడుకుని తన తండ్రికి చెడ్డ పేరు తేవద్దని సూచించారు. ఉండవల్లి శ్రీదేవి ఏపీలో తిరగవచ్చని,  ప్రభుత్వం ఆమెకు కావల్సిన రక్షణ కల్పిస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. 


నాకు ఆఫర్ వచ్చింది- మద్దాల గిరి


 ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ నుంచి తనకు రూ.10 కోట్ల ఆఫర్ వచ్చిందని నిన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక ఆరోపించారు. ఇప్పుడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అలాంటి కామెంట్స్ చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. క్రాస్ ఓటింగ్ చేయాలంటూ టీడీపీ నేతలు తనను సంప్రదించారని టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు వారం ముందు నుండి తనను టీడీపీ నేతలు సంప్రదిస్తూ వచ్చారని, స్వయంగా కూడా కలిశారని మద్దాలి గిరిధర్ తెలిపారు. స్వయంగా టీడీపీ పార్టీ పెద్దలు తనకు ఫోన్ చేశారని.. వాళ్లతో, వీళ్లతో మాట్లాడిస్తామని చెప్పారని వెల్లడించారు. తనకు ఎవరెవరి నుండి ఫోన్ కాల్స్ వచ్చాయో తన కాల్ డేటా చూసుకోమని అన్నారు. తనకు ఫోన్ వచ్చిన నంబర్ ను కూడా ఓ పేపర్ పై రాసి మీరే తీసుకోమని మీడియాను మద్దాలి గిరిధర్ కోరారు. ఆ ఫోన్ నంబర్ ఎవరిదో చూస్తే మీకే అర్థం అవుతోందని తెలిపారు.