Guntur News : గుంటూరు నగరంలో శునకం కోసం ఓ కుటుంబం రోడ్డు ఎక్కింది. నగరంలోని ఏటీ అగ్రహారం 11వ లైనులో వీధి కుక్కల దాడిలో  ఓ పెంపుడు కుక్క పిల్ల మృతి చెందింది. గత రాత్రి వీధి కుక్కలు ఓ ఇంట్లోకి వచ్చి పెంపుడు కుక్కపిల్లపై దాడి చేశాయి. ఈ దాడిలో పెంపుడు కుక్క పిల్ల తీవ్రంగా గాయపడి మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల మృతి చెందడంతో ఆ కుటుంబం తల్లిడిల్లుతుంది. దీంతో చనిపోయిన పెంపుడు కుక్క పిల్లతో యజమాని శివారెడ్డి కుటుంబం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది. వీధి కుక్కల విషయంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని కుక్క పిల్ల యజమాని మండిపడ్డారు. వీధి కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నా పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు స్పందించే వరకూ ఆందోళన చేస్తామని శివారెడ్డి తెలిపారు. అయితే ఇదే సమయంలో జంతు ప్రేమికుడు పేరుతో ఆ వీధిలో ఓ కుటుంబం వ్యవహరిస్తున్న తీరుపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.