Kodali Nani : చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారు, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని హాట్ కామెంట్స్

ABP Desam   |  Satyaprasad Bandaru   |  26 May 2022 08:29 PM (IST)

Kodali Nani On Pawan Kalyan : అమలాపురంలో చిన్న పిల్లలను రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారని పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు. ఫైరింగ్ చేస్తే పరిస్థితి అదుపులోకి వచ్చేదని , కానీ పోలీసులు సంయమనం పాటించారన్నారు.

మాజీ మంత్రి కొడాలి నాని

Kodali Nani On Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీమంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. పిల్లలను రెచ్చగొట్టి శాంతిభద్రతలను కాపాడలేదని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అమలాపురంలో ఫైరింగ్ చేసుంటే పరిస్థితి అదుపులోకి వచ్చేదని, పిల్లల ప్రాణాలు పోతాయని ఫైరింగ్ చేయలేదన్నారు. ఫైరింగ్ చేసి ప్రాణాలు పోతే శవాల వద్ద రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయన్నారు. పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని కొడాని నాని ఘాటుగా వ్యాఖ్యానించారు.

  • పవన్ కల్యాణ్ కు అది కూడా తెలియదు

కృష్ణా జిల్లా గుడివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలన్నారు. అలాంటి వాళ్లను జైల్ లో పెట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రాధాన్యమన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఇళ్లు ప్రభుత్వానికి ముఖ్యంకాదన్నారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగంలోని ఓ విధానమన్నారు. అది కూడా తెలియకుండా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారం గడువు ఇచ్చిందన్నారు. 

  • శవరాజకీయాలు చేసేవాళ్లు 

"మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు నిరసనకారులు తగలబెట్టినా ఒక్కరిని కూడా పోలీసులు గాయపరచలేదు. అందుకు కారణం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం. సీఎం జగన్ ముమ్మడివరం మీటింగ్ వెళ్లినప్పుడు అక్కడి ప్రజాప్రతినిధులు కోస్తా జిల్లా అంబేడ్కర్ పేరు పెట్టమని కోరారు. అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించి అంబేడ్కర్ పేరు పెడుతూ జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని ప్రభుత్వం తెలిపింది. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివే పవన్ కల్యాణ్ నెలరోజులు టైమ్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. కనీసం రాజ్యాంగంలోని ప్రొసిజర్ కూడా తెలియకుండా రాజకీయాలు చేసేందుకు వచ్చారు. పిల్లలను రెచ్చగొట్టి రోడ్లు ఎక్కించి లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోయారు. అంటే లా అండ్ ఆర్డర్ పాటించాలంటే పిల్లలపై కాల్పులు జరపాలి. అభం శుభం తెలియని కాల్పులు జరిపితే శవరాజకీయాలు చేసేవారు. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు కాల్పులు జరపలేదు. పోలీసులు సంయమనం పాటించారు."- - కొడాలి నాని, మాజీ మంత్రి  

Published at: 26 May 2022 08:27 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.