Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీపై ఫైర్ అయ్యారు. లోకేశ్ కు అడ్డువస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని కొడాలి నాని ఆరోపించారు. లోకేశ్ ను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను ప్రజలు అడ్డుకోవాలన్నారు. బీసీలను మళ్లీ వెనకకు నెట్టేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. ఏపీని ఆక్రమించాలని పన్నాగాలు పన్నుతున్నారన్నారు. జోగి రమేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మంత్రులు అయినట్లే అని కొడాలి నాని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరి దమ్ము ధైర్యం కేవలం జగన్ లో మాత్రమే ఉన్నాయన్నారు. అలాంటి జగన్ ను కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. 


జోగి రమేష్ మంత్రి అయితే నేను మంత్రినే! 


ఏపీని ఆక్రమించేందుకు ఓ కులం పన్నాగాలు పన్నుతోందని మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన ఓ సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆయన స్పందించారు.  ఎమ్మెల్యే జోగి రమేష్ ను మంత్రిని చేయడంపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కొడాలి కౌంటర్ ఇచ్చారు. జోగి రమేష్ మంత్రి అయితే తాను, మాజీ మంత్రి పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మంత్రులు అయినట్లే అన్నారు. 


వైసీపీ నేత ఇంట్లో కొడాలి, వంగవీటి  


టీడీపీ నేత వంగవీటి రాధా, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కలవడం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. గుడివాడలోని ఓ వైసీపీ లీడర్ ఇంట్లో జరిగిన వివాహానికి హాజరైన వీరిద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. ఇలా వీళ్లిద్దరు కలవడం కొత్త కాకపోయినా ఇప్పుడున్న పొలిటికల్ సిచ్చుయేషన్ కారణంగా హాట్‌టాపిక్ అవుతోంది. కొడాలి నాని, వంగవీటి రాధ కలసి గుడివాడలో వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. కొడాలి నాని గుడివాడలోనే ఉంటారు. వంగవీటి రాధ మాత్రం విజయవాడలో ఉంటారు. వైసీపీ నేత పెళ్ళి వేడుకకు రాధను ఆహ్వానించారు. ఇదే విషయాన్ని ఆహ్వానితులు కొడాలికి కూడా తెలియచేశారు. దీంతో వంగవీటి రాధ కోసం సుమారు అరగంటపాటు కొడాలి నాని వెయిట్ చేసి మరీ కలిశారు. వంగవీటి రాధ కారు దగ్గరకు వెళ్లి మరి రిసీవ్ చేసుకున్న కొడాలి నాని, ఇద్దరు కలసి వెళ్లి వధూవరనులను ఆశీర్వదించారు. దీంతో వైసీపీలో ఉన్న కొడాలి, టీడీపీలో ఉన్న రాధ కలయికపై మరోసారి రాజకీయవర్గాల్లో చర్చ మెదలైంది. ఇందులో కొత్తేమి లేదని వంగవీటి రాధ, కొడాలి నాని అనుచరులు చెబుతున్నారు. వీరిద్దరు ఎప్పటి నుంచో స్నేహితులు కావడంతో కలిసి పెళ్లికి హాజరయ్యారని అంటున్నారు. 


రాజకీయ చర్చ


ఈ ఇద్దరు నేతలు ఎప్పడు కలుసుకున్నా రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇద్దరు నేతలది వేర్వేరు సామాజిక వర్గాలు. వంగవీటి రాధ కాపు సామాజిక వర్గానికి కీలక నేతగా ఉన్నారు. మాజీ శాసన సభ్యుడు కూడా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్న వంగవీటి రాధ ఆ తరువాత టీడీపీలో చేరారు. ఇది రాజకీయంగా సంచలనమైంది. ఇక కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గుడివాడ నుంచి వరుస విజయాలు సాధిస్తూ వైసీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ఈ ఇద్దరు ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతలు. దీంతో ఇద్దరు నేతలు ఎప్పుడు కలుసుకున్నా, రాజకీయ వర్గాల్లో చర్యలు సర్వసాధారణంగా మారాయి.