Power Tariff in Andhra Pradesh | అమరావతి: ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు విమర్శలు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ  విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. తన 5 ఏళ్ల పాలనలో 9 సార్లు కరెంటు చార్జీల పెంచిన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు కోసం ఈఆర్సీని కోరింది జగన్ అని సంచలన విషయాలు వెల్లడించారు.


ఏపీ జెన్కోను నాశనం చేసింది జగనే


గతంలో చంద్రబాబు హయాంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని అప్పగించారని.. కానీ వ్యక్తిగత స్వార్థంతో నాశనం చేసింది మాజీ సీఎం జగన్ అని ఆరోపించారు. నీ అసమర్థ పాలన, అస్మదీయులకు దోచిపెట్టింది వాస్తవం కాదా? విద్యుత్ హెచ్చుతగ్గులతో ఏపీ జెన్కోని నాశనం చేసింది నువ్వు కాదా ? అని మంత్రి గొట్టిపాటి ప్రశ్నించారు. పీపీఏలను రద్దు చేయడం, ఉత్పత్తిదారులను భయపెట్టడంతో కేంద్ర, విదేశీ బ్యాంకుల వద్ద ఆంధ్రప్రదేశ్ పరువు తీశావంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  2022- 23, 2023- 2024 ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రజలపై మోపాలని డిస్కంలకు అనుమతి ఇచ్చింది నువ్వు కాదా జగన్? అని మాజీ సీఎంను మంత్రి గొట్టిపాటి సూటిగా ప్రశ్నించారు.


విద్యుత్ ఛార్జీల పెంపు కోరింది వైసీపీ హయాంలోనే


వైసీపీ హయాంలోనే డిస్కంలు విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ అనుమతి కోరింది.  9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల రక్తం తాగిన జగన్.. ఏపీ సీఎం చంద్రబాబు పాలనను విమర్శించడమా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో నువ్వు చేసిన తప్పిదాలతోనే కదా అనవసరంగా హిందూజా పవర్ కు రూ.1200 కోట్లు కట్టాల్సి వచ్చింది. నీ హయంలో ప్రతీ వ్యవస్థ నాశనం అయ్యింది జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను, మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన నువ్వు.. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని వైసీపీ అధినేత జగన్ ను ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నిలదీశారు.



జగన్ అయిదేళ్ల పాలనతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని త్వరలో ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గాడిన పెడతామని ఏపీ మంత్రులు చెబుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మించి చూపిస్తామని చెబుతున్నారు. విద్యుత్ శాఖను సైతం త్వరలోనే లాభాల బాటలోకి తెస్తామని గొట్టిపాటి పేర్కొన్నారు. రాజధాని అమరావతి సహా పెండింగ్ లో అన్ని పనులు, ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అన్నారు.


Also Read: YS Jagana And YS Sharmila: జగన్, షర్మిల పంచాయితీకి జడ్జి విజయమ్మే- మాట్లాడే అర్హత వేరే వాళ్లకు లేదు: బాలినేని శ్రీనివాస రెడ్డి