CM Jagan : గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం జగన్ వీడ్కోలు పలికారు. అదే సమయంలో ప్రధానమంత్రికి సీఎం విజ్ఞాపన పత్రం అందించారు. ఇందులో పలు అంశాల గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. రీసోర్స్ గ్యాప్‌ గ్రాంటు అంశాన్ని గుర్తుచేసిన సీఎం... రూ.34,125.5 కోట్ల రీసోర్స్‌ గ్యాప్‌ కింద గ్రాంటుగా ఇవ్వాలని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాల్సిందిగా కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు.  


ఇనుప గనులు కేటాయించండి 


జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్‌ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. వీటిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు ఆర్థికసాయం చేయాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరు చేయాలని కోరారు. ఏపీ ఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.