Andhra Liquor Scam Head Constable vs SIT: ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి AR హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాశారు. దానికి తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఉన్న ఫోటోను జత చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ సహా పలువురికి రాసిన లేఖలో  పదేళ్ లపాటు చెవిరెడ్డి దగ్గర గన్‍మెన్‍గా చేశానని తెలిపారు. లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపించారు.  నాకంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్టే విన్నాడని అధికారులు చెప్పారనన్నారు.  విచారణకు యూనిఫాంలో వెళ్లినందుకు నన్ను తిట్టారు.. చెవిరెడ్డికి కేసుతో సంబంధం ఉందని చెప్పమన్నారని ఆరోపించారు. తప్పుడు స్టేట్‍మెంట్ ఇవ్వనని చెప్పినందుకు నాపై పది మంది సిట్ అధికారులు దాడికి దిగారనన్నారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు వెళ్లలేనని మదన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.                       


మదన్ రెడ్డి ఆరోపణలను లిక్కర్ స్కామ్ పై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సీరియస్ అయింది. మదన్ రెడ్డి కొత్త నాటకానికి తెర తీశాడని .. పోలీసులు వేధించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. విచారణలో సిట్ అధికారులు కొట్టారన్నది అబద్దమని.. ఈ ఆరోపణల వెనుక ఉన్న కుట్ర కోణాన్ని బహిర్గతం చేస్తామన్నారు. మదన్ రెడ్డి ఆరోపణలపై డీజీ స్థాయి అధికారులతో విచారణ  చేయించాలని సిట్ కోరింది. తప్పు ఎవరిదైనా కఠినమైన యాక్షన్ తీసుకోవాలన్నారు. లిక్కర్ స్కామ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి డబ్బులు అందాయని...వాటిని ఎన్నికల్లో పంచారని సిట్ తెలిపింది. సత్యమేవ జయతే అంటూ సిట్ ఈ ప్రకటన విడుదల చేసింది.       


లిక్కర్ స్కాం దర్యాప్తు అత్యంత కీలక దశకు చేరుకోవడంతో నిందితులు రకరకాల కుట్రలు చేస్తున్నారని సిట్ అనుమానిస్తోంది . చెవిరెడ్డికి సంబంధం ఉందని బయటకు తెలియక ముందే..  గతంలో చెవిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన వద్ద పని చేసిన గన్‌మెన్లు, పీఏలను విచారిస్తున్నారని వారిని హింసిస్తున్నారని తప్పుడు స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. చెవిరెడ్డి ఎవరికీ అనుమానం రాకుండా.. తన వద్ద గన్ మెన్లు పనిచేసిన పోలీసుల్నే.. ఎన్నికల్లో డబ్బుల రవాణాకు ఉపయోగించారని సిట్ అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఆయన దగ్గర పని చేసిన వారు.. డబ్బుల రవాణాలో కీలకంగా వ్యవహిరంచారని అనుకున్న వారిని సిట్ ప్రశ్నిస్తోంది.                      


ఈ క్రమంలో పదేళ్లుగా చెవిరెడ్డి వద్ద గన్ మెన్ గా పని చేసిన మదన్ రెడ్డి ఏకంగా సిట్ అధికారులపైనే ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఆయన ఇప్పటికీ సర్వీసులో ఉన్నారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడి వద్ద అయినా పదేళ్ల పాటు ఒకే గన్ మెన్ పని చేయరు. కానీ మదన్ రెడ్డి గన్ మెన్ గా పని చేయడంతో వారి వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యవహరించేవారని.. ఇతర విదులు కేటాయించినా హాజరయ్యే వారు కాదని చెబుతున్నారు. మదన్ రెడ్డి ఆరోపణల్ని సిట్ సీరియస్ గా తీసుకుంది. అందుకే ఈ వ్యవహారం కీలక మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయి.