Talliki Vandanam Funds:  కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా గురువారం తల్లులకు కానుక గా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి సిఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్నారు. 

Continues below advertisement


ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింప చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేస్తారు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీ.వో విడుదల కానుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు  చేసింది ప్రభుత్వం. 


ఏపీలో ఇంటర్ వరకూ ఉన్న విద్యార్థుల్లో 93 శాతం మందికి ఇస్తున్నారు. మిగిలి ఏడు శాతం మంది అత్యున్నత ఆదాయ వర్గాల వారు. 





ఈ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన పని లేదు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆయా పాఠశాలల నుంచి డేటాను సేకరించి లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ.15000 జమ చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి ఈ పథకం కింద పేరు నమోదు చేయించుకోవచ్చు.  





కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరుగా అమలు చేస్తున్న భారీ నగదు బదిలీ పథకం ఇదే.  చదువుకునే ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఖాతాల్లో జమ చేస్తూండటం సంచలనంగా  మారనుంది. గత ప్రభుత్వం పదిహేను వేలు అని చెప్పినప్పటికీ పదమూడు వేలు మాత్రమే .. అది కూడా 40 లక్షల మందికే జమ చేసేది.  కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కరికే ఇచ్చేవారు.  ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు.