Konaseema Crop Holiday :  కోనసీమ జిల్లాలో  12 మండలాల్లో క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలోనే క్రాప్ హాలిడే పాటిస్తున్నామని రైతులు అంటున్నారు. కోనసీమలోని క్రాఫ్ హాలిడే ఉద్యమంలో రాజకీయ కోణం లేదని రైతులు స్పష్టం చేశారు. క్రాప్ హాలీడే ప్రకటించిన తర్వాత రైతులను ఆర్డీవో పిలిపించారు. అయితే రైతులు వచ్చే సరికి ఆర్డీవో అందుబాటులో లేరు. న


నష్టాలు  బరిస్తూ సాగు చేయలేమని ప్రకటించిన కోనసీమ రైతులు 


రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండానే రైతులు నష్టాలను భరించలేక ఉద్యమం బాట పట్టామని రైతులు ప్రకటించారు.  ఈ ఉద్యమంలో అన్ని పార్టీలకు చెందిన  నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.. అంతేగాని ఇది రాజకీయ కోణంలో చూడొద్దని రైతులు కోరుతున్నారు.  ప్రధానంగా మూడు డిమాండ్లు అధికారుల ముందు ఉంచాలని వచ్చాం.. రమ్మని పిలిచిన అధికారులు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. కార్యచరణను త్వరలోనే ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇప్పించాలని.. రైతులు కోరుతున్నారు. 


ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నామంటున్న రైతులు


తమ ఉద్యమంలో ఇందులో భూస్వాముల లేరని... వారు ఉద్యమానికి సహకరించరని.. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నష్టపోయేది రైతులే కానీ భూస్వాములు కాదంటున్నారు.  డ్రైన్లు అధ్వానంగా మారాయి... తొలకరి పంట ఊడ్చితే వర్షాలకు ముంపుకు గురయ్యి రైతులు నష్ట పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.  గిట్టుబాటు ధర కల్పించాలి.. డ్రెయిన్లు ఆధునిక రించాలి..  రైతులకు అవసరమైన సమయంలో ఉపాధి హామీ పనులను తాత్కాలికంగా నిలపాలి... ఇవే మా ప్రధాన డిమాండ్లు అనిరైతులు చెబుతున్నారు. 


 ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపిన రైతులు


ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని.. యాంత్రీకరణ విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే అన్ని మండలాల్లోనూ తహాసిల్దార్ లకు వినతి పత్రాలు అందించామని  త్వరలోనే తమ ఉద్యమ కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. ఆర్డీవో పిలిస్తే వచ్చిన రైతులు.. ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో గంట సేపు వేచి చూసి నిరసన తెలిపి తిరిగి వెళ్లిపోయారు. తమ పోరాటం ఆగదని ప్రకటించారు.  అధికారులు రైతులతో చర్చించిన తర్వాత  క్రాప్ హాలీడే పై రైతులు ముందుకెళ్తారా .. పంటలు వేస్తారా అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.