చెప్పాడంటే చేస్తాడంతే.. అనే నమ్మకం కలిగించటంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సెల్ఫీ దిగలేదని తెలగు దేశం కార్యకర్త నారా లోకేష్ పై కోడిగుడ్లు వేస్తే ప్రభుత్వానికేంటి సంబంధమని ఆయన ప్రశ్నించారు.


ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది..


సీపీఎస్ ఉద్యోగులు పదవి విరమణ చేస్తే పెన్షన్ కూడా గతంలో అందేదికాదని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని. ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇచ్చేవారు కాదన్నారు. అయితే సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ ని రద్దు చేశారన్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోని పక్కన పడేసే వ్యక్తి అని పేర్ని నాని విమర్శించారు. పీఆర్సీ వేయాలన్నా కూడా గతంలో రోడ్డెక్కి ఆందోళన చేసేవారని, కానీ ఎవరూ రోడ్డెక్కకుండా 12వ పీఆర్సీని జగన్ వేశారని నాని తెలిపారు.


కాలయాపనతో సరిపెట్టిన చంద్రబాబు


40 ఏళ్ల అనుభవం ఉందనే చంద్రబాబు కాలయాపన కోసం మంత్రి వర్గ ఉపసంఘం వేసేవారని, దీంతో పీఆర్సీ అటకెక్కేదని తెలిపారు. ఉపసంఘాల వలన ఎవరికైనా ప్రయోజనం కలిగిందా అని నాని ప్రశ్నించారు. జగన్ మాత్రమే సమస్యలపై చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ మాత్రమే ఇలా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఏపీవీపి ఉద్యోగులకు మూడు నెలకొకసారి జీతం వచ్చేదని, బిల్లులు చేయించుకుని, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ వచ్చిన తరువాతనే జీతాలు తీసుకోవాల్సి వచ్చేదన్నారు. రిటైర్డ్ అయిన వారి కష్టాలు  అన్ని ఇన్నీ కాదని చెప్పారు. సుమారు 13 వేల మంది ఉద్యోగులకు ఇక పై  నెలనెలా జీతం వచ్చేలా జగన్ నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. ఉద్యోగుల పట్ల సీఎం జగన్ ఎంత సానుకూలంగా ఉంటారో ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్నారు. చెవితో విని మనసుతో నిర్ణయాలు తీసుకుంటారని ప్రశంసించారు.


ప్రభుత్వ సర్వీసులోకి వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులు..


ప్రభుత్వ వైద్యవిధాన పరిషత్‌లో వైద్యులు కాకుండా నర్సులు, ఇతరత్రా ఉద్యోగులకు నెలనెలా జీతాలు కోసం అవస్థలు పడ్డారని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. మండలాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల బిల్లును జిల్లా కేంద్రాల్లో సంతకాలు కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని చెప్పారు. అయితే ఇప్పుడు అలాంటి జాప్యమేమీ లేకుండా దాదాపు 13వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపి, వారికి నెలనెలా జీతం అందించే ప్రక్రియకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.


ఆ పని చేసింది టీడీపీ వాళ్ళే...
తెలుగు దేశం పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్దాయిలో ఫైర్ అయ్యారు. లోకేష్ ఎమ్మెల్యే కాదు, పార్టీకి అధ్యక్షుడు కూడా కాదన్నారు.ఆయనకు భద్రత కరువై పోయిందని గవర్నర్ ని కలవటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తెచ్చుకున్న జనాన్ని చూసుకుని పోలీసులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.అచ్చెన్నాయుడు కూడా పోలీసులను బండబూతులు తిడుతున్నారని, సొంత పార్టీ వాళ్లే సెల్ఫీ తీసుకోనివ్వలేదని కోడిగుడ్డు వేస్తే ప్రభుత్వం రక్షణ కల్పించలేదనటం హస్యాస్పదంగా ఉందన్నారు. ముందు వాళ్ల కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాలని సూచించారు.పోలీసులు మంచోళ్లు కాబట్టి ఎన్ని తిట్లు తిట్టినా లోకేష్ కు భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. వర్ల రామయ్య ఏ పదవి చేశాడని ఆయన సలహాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు. టీడీపీలో పొలిట్ బ్యూరో అంటే తోతాపురి కంపెనీ లాంటిదని, చంద్రబాబుకు వర్ల రామయ్య సలహాలు ఇస్తే మంచిదని హితవు పలికారు. రాజకీయ నాయకుడు అంటే కులనేతలుగా చంద్రబాబు మార్చేశారని ఆరోపించారు.