Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి సీతారామంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానాలపై ఈసీ బదిలి వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీరిద్దరిని ఎన్నికల విధులతో సంబంధం లేని డ్యూటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.




ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్‌కు ఈసీ షాకిచ్చింది. ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర సీపీ కాంతిరాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. వీరిని తక్షణమే విధుల నుంచి బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని డ్యూటీ అప్పటించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల విజయవాడలో సీఎం జగన్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఓ అగంతుకుడు రాయితో దాడి చేయడం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఈసీ విజయవాడ సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.


రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై వేటు
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ ఇటీవల వేటు వేసింది. పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి పనిచేస్తున్నారు. కొన్నిరోజుల కిందట వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినట్టు గుర్తించారు. కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వారి ఫిర్యాదును పరిశీలించిన ఈసీ కడప కలెక్టర్ తో నివేదిక తెప్పించుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తేలడంతో వెంకట్రామిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. 


ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై బదిలీ వేటు !
ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై ఎలక్షన్ కమిషన్ ఇటీవల బదిలీ వేటు వేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి,  ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువాపై బదిలీ వేటు వేసింది ఈసీ.  బదిలీ అయిన అధికారులు తమ కింది వారిని తక్షణం బాధ్యతలు నుంచి తప్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది.