EC serves notice to ap pcc chief Ys Sharmila- ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలు వైఎస్ షర్మిలకు ec షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్
వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో తప్పుడు ఆరోపణలు చేసినందుకు షర్మిలకు ec  నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ నేతలు, ఎంపీ అవినాష్ రెడ్డి, మల్లాదివిష్ణు ఫిర్యాదుతో షర్మిలకు ECనోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని షర్మిలకు ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. 


హంతకులను జైళ్లకు పంపించాలన్న షర్మిల.. 
హంతకులు చట్టసభలకు కాదు జైళ్లకు వెళ్లాలని ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉందని తెలిసినా అవినాష్ రెడ్డికి సీఎం జగన్ మరోసారి కడప ఎంపీ సీటు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని సైతం షర్మిల పదే పదే ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే చిన్నాన్న వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న నిందితులను వైఎస్ జగన్ ఎందుకు కాపాడుతున్నారో తనకు అర్థం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. 


నాశనం చేసే వారికి ఓటు వేయవద్దన్న షర్మిల 
ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి ఓటు వేస్తారా, హత్యా రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసే వారికి ఓటు వేస్తారా అని సైతం షర్మిల పలుమార్లు వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె ప్రధాన ఆయుధం బాబాయ్ వివేకా హత్య. టీడీపీ ప్రభుత్వ సమయంలో వివేకా హత్య జరిగాక, ఎంక్వైరీ చేసి దోషులను అరెస్ట్ చేయాలని పట్టుబడిన తన సోదరుడు జగన్.. అధికారంలోకి వచ్చాక కేసును పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు. తమ సోదరి సునీత న్యాయ పోరాటం చేసినా, జగన్ అందుకు మద్దతు తెలపకపోవడాన్ని షర్మిల తప్పుపట్టారు. కుటుంబానికే అన్యాయం జరిగితే కాపాడలేని వ్యక్తి జగన్ అని, అలాంటి నేత సోదరి సునీతకు ఇంకేం న్యాయం చేస్తారో అని విమర్శలు గుప్పించారు. 


వివేకా చనిపోయే ముందు కడప ఎంపీ స్థానం నుంచి తనను పోటీ చేయాలని కోరగా.. అప్పట్లో తనకు ఈ విషయం అర్థం కాలేదన్నారు షర్మిల. చిన్నాన్న హత్యకు గురయ్యాక కుట్ర చేసింది ఎవరో ఒక్కో విషయంపై క్లారిటీ వచ్చిందని చెప్పారు. వివేకా హత్య కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని, ఒకవేళ చిన్నాన్న హత్యతో సంబంధం లేదని తేలితే టికెట్ ఇచ్చినా తనకు పరవాలేదన్నారు. వివేకా హత్య కేసు దొంగలకు ఎందుకు అండగా ఉంటున్నారో, వాళ్లను ఎందుకు వెనకేసుకు వచ్చి.. సునీతపై దుష్ప్రచారం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమైందని షర్మిల పలుమార్లు పేర్కొన్నారు.