రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం అవుతాయని ఆయన అన్నారు.
వర్చువల్ గా ఇ స్టాంపింగ్ సేవలను ప్రారంభించిన జగన్..
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ గా ఇ స్టాంపింగ్ సేవలను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని వలన రిజిస్ట్రేషన్‌ సేవలు ఇక సులభతరం అవుతాయని జగన్ అన్నారు. ప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించే విధంగా, ఇ–స్టాంపింగ్‌ విధానం అమలులోకి తీసుకువచ్చామని చెప్పారు. ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం ఆవిష్కరణ జరగటం నూతన శకానికి నాందిగా జగన్ అభివర్ణించారు.
సురక్షితమయిన ఇ–స్టాంపింగ్‌ ప్రయోజనాలు...
ఇ–స్టాంపింగ్‌ విధానం సురక్షితమైందని, భద్రత పరంగా, ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిదని అధికారులు వెల్లడించారు. www.shcilestamp.com వెబ్‌సైట్‌లో, ఇ–స్టాంపింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇ–స్టాంపులు ఆన్‌లైన్‌లో దృవీకరించుకోవచ్చని, నగదు, చెక్కు, ఆన్‌లైన్‌ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐ, ఆప్కాబ్, యూనియన్‌ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్‌ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్‌ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్‌ ద్వారా స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీలను చెల్లించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టాంప్‌ మరియు రిజిస్ట్రేషన్‌ శాఖ సెంట్రల్‌ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి  డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్, ఐజీ రామకృష్ణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ (గుంటూరు) జి.శ్రీనివాసరావు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రతినిధులు హజరయ్యారు.


వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకానికి జాతీయ స్థాయి గుర్తింపు.. 
డాక్టర్‌ వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది. ఈ మేరకు అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్‌ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌కు.. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్‌ అహుజా అందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను కలిసి, భారత ప్రభుత్వం అందజేసిన అవార్డుకు సంబంధించిన వివరాలను గురించి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ వివరించారు. అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పనిచేయాలని, దిగుబడుల అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్ధేశం  చేశారు. సాగు చేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్‌ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్‌ నమోదు ఆధారంగా అమలు చేయడం ద్వారా యూనివర్శల్‌ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సొంతం చేసుకుందని అధికారులు చెప్పారు.