Bihar Assembly Election 2025 | పాట్నా: వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బిహార్ పాత్ర చాలా కీలకమైంది. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి మరోమారు యువత ఎన్డీఏ(NDA)ను గెలిపించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నా వెళ్లిన లోకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇక్కడకు రాలేదు. తాను బాధ్యతాయుతమైన భారతీయుడిగా బిహార్కు వచ్చానన్నారు.
ఏపీ మంత్రిగా ఇక్కడికి రాలేదు..
‘బిహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకమైనది. రాష్ట్ర యువత మరోసారి ఎన్ డీఏని ఎందుకు గెలిపించాలని చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడ ప్రజలు ఎన్ డీఏని గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్ లో 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు క్షీణించి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దానివల్ల మా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అటువంటి పరిస్థితులు బీహార్ లో తెచ్చుకోవద్దని బీహార్ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. బీహార్ అభివృద్ధి కోసం ఎన్ డీఏను మరోమారు గెలిపించాలి. బీహార్ లో మూడు కారణాల వల్ల ఎన్ డీఏ ని గెలిపించాల్సిన అవసరం ఉందని’ నారా లోకేష్ అన్నారు.
1. లీడర్ షిప్ ట్రాక్ రికార్డు – స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్ డీఏని గెలిపించాలి. ప్రధాని నరేంద్రమోడీ బిహార్ రూపురేఖలు మార్చేశారు. బిహార్ లో నాని (నరేంద్ర మోడీ జీ, నితీష్ కుమార్ జీ) నాయకత్వం ఉంది. ఏపీలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయకత్వం ఉంది. విజన్, సమర్థతతో వారు పాలన చేస్తున్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బిహార్ పాత్ర చాలా కీలకం. బిహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే ఆయన లక్ష్యం.
2. డబుల్ ఇంజన్ సర్కారు – బిహార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు లభిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. పలు పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంది.
3. ప్రభుత్వాల కొనసాగింపు ముఖ్యం - గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బిహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగున్నాయి. పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బిహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మా సీఎం చంద్రబాబు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.
ఆచరణ సాధ్యం కానీ హామీలను నమ్మొద్దు
బిహార్ లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను రాష్ట్ర యువత నమ్మవద్దు. ఎన్ డీఏ భాగస్వామిగా చెబుతున్నాం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారతజాతి బలోపేతమవుతుంది. ప్రధాని మోదీ బిహార్ రూపురేఖలు మార్చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు కారణంగా బిహార్, ఏపీలకు కేంద్రంనుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యుడు సానా సతీష్, గంటి హరీష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.