Avinash Reddy Mother Health :  కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిలో పురోగతి ఉందని వైద్యులు తెలిపారు.  వాంతులు తగ్గాయని .. ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించడానికి ప్లాన్ చేస్తున్నామని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఆరు రోజుల నుంచి అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. 


19వ తేదన అనారోగ్యానికి గురైన అవినాష్ రెడ్డి తల్లి                                             
 
ఈ నెల 19వ తేదీన  పులివెందులలో  శ్రీలక్ష్మి  అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్సకు హైద్రాబాద్ కు తరలించాలని భావించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నెల19న సీబీఐ విచారణకు  హాజరవ్వాల్సి ఉండగాతల్లికి అస్వస్థత గరించి తెలియగానే సీబీఐ విచారణకు వెళ్లకుండా నేరుగా పులివెందులకు వెళ్లారు.   పులివెందులకు  వెళ్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద తల్లి వస్తున్న అంబులెన్స్ ఎదురైంది. అదే అంబులెన్స్  ద్వారా  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో శ్రీలక్ష్మిని  చేర్పించారు. 


ఆ రోజు నుంచి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స                                                 
 
మరోవైపు అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు   రోజూ హెల్త్  బులిటెన్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మొదటి రోజు ఆమె పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలిపారు.   రెండు కవాటాలూ పని చేయట్లేదని తెలిపారు. ఆమెకు లోబీపీ ఉందనీ... ఐసీయూలోనే ఉంచి ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఐదు రోజుల చికిత్స తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడినట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. మరో వైపు సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం  జరుగుతూండటంతో పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు ఆస్పత్రి వద్దే ఉంటున్నారు. 


అవినాష్ రెడ్డి తల్లికి పలువురి పరామర్శ 


ఆస్పత్రి వద్ద అనుచరులు పెద్ద ఎత్తున గుమికూడి ఉండటంతో ఇతర రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న అవినాష్ రెడ్డి  తల్లిని జగన్ తల్లి విజయలక్ష్మి పరామర్శించారు. ఆ తర్వాత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలారెడ్డి పరామర్శించారు. పలువురు. వైఎస్ఆర్‌సీపీ నేతలుకూడా వచ్చి.. అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడేదాకా.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించవద్దని..  ఆయన అనుచరులు ఆస్పత్రి ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.