Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న కీలక నేతలను సీబీఐ అరెస్టు చేస్తుంది. ఇటీవల దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్టు చేసింది. తాజాగా ఈ కేసులో అరెస్టైన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ జ్యుడిషియల్ కస్టడీని సీబీఐ స్పెషల్ కోర్టు పొడిగించింది. కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా మాగుంట రాఘవ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. రాఘవకు 14 రోజుల పాటు కస్టడీ పొడిగించింది. మాగుంట రాఘవ ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్నారు. మార్చి 13న రాఘవ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో విచారణకు రానుంది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 


రూ.100 కోట్ల ముడుపులు 


 దిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డిని ఫిబ్రవరి 10న  ఈడీ అరెస్టు చేసింది. అనంతరం దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఈడీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి పేర్లను ప్రస్తావించింది.  దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్‌ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించి ఆప్ నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్‌లో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి.   


మనీశ్ సిసోడియా అరెస్టు 


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ లో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారణ చేసి అరెస్టు చేశారు.మద్యం పాలసీపై పలు కోణాల్లో సీబీఐ అధికారులు సిసోడియాను ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ లో నమోదైన దినేష్ అరోరాతో పాటు ఇతర నిందితులతో సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. అయితే డిప్యూటీ సీఎం సిసోడియా చెప్పిన సమాధానాలపై సీబీఐ అధికారులు సంతృప్తి చెందలేదు. సిసోడియా విచారణకు సరిగా సహకరించడం లేదని, విషయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.  


ఐదుగురికి బెయిల్ 


దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్‌సింగ్, నరేంద్రసింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్​లకు రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్ ​లను అరెస్టు చేయకుండానే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది.  వీరిలో అరుణ్ పిళ్లైను ఇటీవల ఈడీ విచారణ చేసింది. ఈ  స్కామ్ కు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ముత్తా గౌతమ్ మినహా మిగతా నిందితులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి ఇప్పటికే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే వీరిద్దరూ మాత్రం ఈడీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ​లో ఉన్నారు.