CM Jagan Meets PM Modi : ఏపీ సీఎం జగన్ దిల్లీలో పర్యటిస్తున్నారు. దిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించారు. అంతకు ముందు దిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి వైసీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ గురువారం దిల్లీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరిన ఆయన మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ దిల్లీలో పర్యటిస్తున్నారు. దిల్లీ పర్యటలో సీఎం జగన్ ప్రధాని మోదీతో అయ్యారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. 



ప్రధానితో భేటీలో చర్చించిన అంశాలు 


ప్రధాని మోదీతో భేటీలో సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రెవిన్యూలోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనులు కేటాయింపు, మెడికల్‌ కాలేజీలు తదితర అంశాలను ప్రధానికి సీఎం నివేదించారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందించారు. 2014–15కు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు ప్రకారం 10వ వేతన సంఘం బకాయిల విషయంలో, డిస్కంల ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ ప్యాకేజీ, వృద్ధులకు పెన్షన్లు, రైతుల  రుణమాఫీకి సంబంధించి మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్‌ కింద ఏపీకి రావాల్సి ఉందని సీఎం జగన్ తెలిపారు. ఈ అంశంపై వెంటనే దృష్టిసారించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


తెలంగాణ విద్యుత్ బాకాయిలు 


తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలను చెల్లించాల్సి ఉందని, రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఈ వ్యవహారాన్ని వెంటనే సెటిల్‌ చేయాల్సిందిగా ప్రధానిని విజ్ఞప్తి చేశారు. 2016–17 నుంచి 2018–19 వరకూ అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారన్నారు. గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారని,  రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావన్నారు. కోవిడ్‌ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. 


ఆ నిధులు చెల్లించండి
 
సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాల్సిందిగా ప్రధానిని సీఎం కోరారు. ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలన్నారు. గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌ వారీగా విడివిడిగా కాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రియింబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఈ ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చుచేసిన రూ.905.51 కోట్ల రూపాయలను చెల్లించలేదన్న సీఎం... ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చును 15 రోజుల్లోగా చెల్లించేలా చూడాలన్నారు. 


భోగపురం ఎయిర్ పోర్టుకు క్లియరెన్స్


రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామని ప్రధానికి సీఎం జగన్ తెలిపారు. దీంతో జిల్లాల సంఖ్య 26కు చేరిందని, రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని కొత్తగా మరో 3 మెడికల్‌ కాలేజీలకే కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. మొత్తంగా 26 జిల్లాలకు 14 మెడికల్‌ కాలేజీలు ఉన్నట్టు అవుతుందని, రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలంటే.. మెడికల్‌ కాలేజీలు చాలా అవసరమన్నారు. మిగిలిన 12 కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ సమీపంలోని భోగాపురంలో ఎయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. గతంలో ఇచ్చిన క్లియరెన్స్‌ గడువు ముగిసిందని.  తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఈమేరకు పౌరవిమానయానశాఖకు తగిన ఆదేశాలు కోరారు.  ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారని సీఎం జగన్ గుర్తుచేశారు. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్‌ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్‌ ఓర్‌ సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి  ఇనుప గనులు కేటాయించాలని కోరారు. రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రగతికి స్టీల్‌ప్లాంట్‌ అన్నది చాలా అవసరమన్నారు. 


ఆర్థిక మంత్రితో భేటీ 


ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సీఎం జగన్ వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్  చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.17 వేల కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్‌ ఆర్థిక మంత్రిని విజ్ఞప్తి చేశారు. నిధుల సమీకరణకు ఆటంకాలు లేకుండా బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేయాలని కోరారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.



(కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్






Also Read : CJI NV Ramana Comments : న్యాయవ్యవస్థపై అభాండాలు వేసేవాళ్లను ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం - గుర్తు పెట్టుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యలు !