Vizag  Rushikonda Palace: రుషికొండ భవనాల అదృష్టం త్వరలో మారబోతోంది. ఈ ప్యాలెస్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ కసరత్తును ముగించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఈ భవనాలను ప్రజాధనానికి భారంగా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వనరుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 10న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని, అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

భారీగా నిర్వహణ భారం 

గతంలో రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్స్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు  7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం నిర్మించిన ప్యాలెస్ నిర్వహణకే నెలకు 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. విద్యుత్ ఛార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి ఏడాదికి  3 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చవుతుండటంతో, ప్రభుత్వం దీనిని  ప్రోపర్ యుటిలైజేషన్ చేయాలని నిర్ణయించింది. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, సుమారు 1517 మంది నుంచి సేకరించిన సూచనల ఆధారంగా ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది.   

 రేసులో అంతర్జాతీయ హోటల్ దిగ్గజాలు 

రుషికొండ ప్యాలెస్ నిర్వహణకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉన్న *తాజ్ గ్రూప్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా  వంటి నాలుగు ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఈ భవనాలను ఒక విలాసవంతమైన హోటల్ లేదా రిసార్ట్‌గా మార్చడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ నాలుగు గ్రూపుల్లో ఒకదానికి నిర్వహణ బాధ్యతలు అప్పగించి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.  

ప్రజా సందర్శనకు అవకాశం 

ప్యాలెస్‌ను కమర్షియల్ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నప్పటికీ, సామాన్య ప్రజలు కూడా ఆ భవనాలను సందర్శించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది కేవలం ఒక రహస్య బంగ్లాగా మిగిలిపోకుండా, విశాఖ పర్యాటకంలో ఒక భాగంగా మార్చాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు, ప్రజలకు కూడా దీని వల్ల ప్రయోజనం ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈనెల 10న కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఈ విలాసవంతమైన భవనాల కొత్త రూపం ఖరారు కానుంది.