YS Jagan Murder Attempt Case: సీఎం జగన్‌పై కోడికత్తితో హత్యాయత్నం కేసులో విశాఖ జైల్లో ఉన్న కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు తలెత్తున్నాయి.గత ఐదేళ్లుగా  శ్రీనివాసరావు జైలు జీవితం గడుపుతున్నాడు. కేసు ఎటూ తేలకపోవడంతో తనకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు ఈ నెల 18 నుంచి జైల్లో నిరాహారదీక్షకు దిగాడు. సీఎం జగన్‌ కోర్టులో సాక్ష్యం చెప్పాలని, లేదా ఎన్‌వోసీ ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.


దీక్షపై అనుమానాలు
ఈ విషయాన్ని ములాఖత్‌లో తనను కలిసిన దళిత సంఘ నేతలకు శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ నేపథ్యంలో దీక్ష విషయంలో జైలు అధికారుల ప్రకటనలతో గందరగోళం నెలకొంది. నిందితుడు శ్రీనివాసరావు ఆహారం తీసుకుంటున్నాడని అధికారులు చెబుతుండటంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీక్ష చేస్తున్నానని శ్రీనివాస్ దళిత సంఘాల నేతలకు చెప్తుండగా, పోలీసులు మాత్రం శ్రీనివాస్ ఆహారం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో విశాఖ కేంద్ర కారాగారంలో ఏం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


శ్రీనును కలిసిన దళిత సంఘాల నేతలు
న్యాయం చేయాలంటూ శ్రీను చేపట్టిన దీక్షను తొలుత అధికారులు పెద్దగా పట్టించుకోలేదని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. జైలు వద్ద దళిత సంఘాల నేతలు ప్లకార్డులు ప్రదర్శించడం, ములాఖత్‌ కోరడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జైలు అధికారులు అంతా కట్టుదిట్టం చేశారు. వారితో శ్రీను ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ఓ అధికారి అక్కడే ఉన్నట్లు సమాచారం. దళిత నేతలు కలిసి వచ్చిన కొద్దిసేపటికే శ్రీను జైల్లో దీక్ష చేయడం లేదని ప్రకటించడం చర్చనీయాంశమైంది.


మరోసారి ముళాఖత్ అడిగిన దళిత నేతలు
జైల్లో శ్రీనివాసరావు నిరాహార దీక్షలో ఉన్నాడా? లేక అధికారులు అడ్డుకున్నారా? అనే నిజం తెలుసుకునేందుకు విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు శనివారం మరోసారి ములాఖత్‌ అడిగారు. దాదాపు మూడు గంటలు వారిని వెయిట్ చేయించిన తరువాత అనుమతుల్లేవంటూ బయటకు పంపేశారు. దీనిపై విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ బూసి వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు.


ఖైదీని బంధుమిత్రులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉన్నా అధికారులు అనుమతివ్వలేదని ఆయన ఆరోపించారు. శ్రీను తరఫున ములాఖత్‌ అయ్యే బంధుమిత్రుల జాబితాలో తన పేరు ఒక్కటే విశాఖ నుంచి ఉందని వెల్లడించారు. శ్రీను కుటుంబసభ్యులు దీక్షలో ఉండటంతో వచ్చే అవకాశం లేదని, మరి రెండో ములాఖత్‌ ఎవరికి ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. జైలు అధికారులు కావాలనే శ్రీను ఆరోగ్య విషయం దాచిపెడుతున్నారని ఆరోపించారు.


దీక్ష చేస్తున్నారు.. బిస్కెట్లు తింటున్నారు!
శ్రీను ఆరోగ్యంపై విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు చేస్తున్న ఆరోపణలపై జైలు పర్యవేక్షణాధికారి కిషోర్‌ కుమార్‌ స్పందించారు. శ్రీను మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారని, అయితే బిస్కెట్లు తీసుకుంటున్నట్లు తోటి ఖైదీలు చెప్పారని ఆయన తెలిపారు. ప్రస్తుతం శ్రీను ఆరోగ్యం బాగానే ఉందని, రోజూ డాక్టర్‌ పర్యవేక్షణ సాగుతోందని చెప్పారు. శ్రీను దీక్షలో ఉన్నందున అతన్ని కలిసేందుకు ములాఖత్‌ నిరాకరించామని పేర్కొన్నారు.