Daadi  Veerabhadra Rao into TDP : వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు తెలుగుదేశంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బుధవారం చంద్రబాబుతో సమావేశం కానున్నారు.  విశాఖ జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు .. టీడీపీని వీడిన తర్వాత  వెనుకబడిపోయారు.  వైసీపీలో చేరిన ఆయనకు పెద్దగా అవకాశాలు లభించలేదు.  ఇప్పుడు కూడా వైసీపీలో గుర్తింపు లభించే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేశారు. బుధవారం చంద్రబాబును కలవనున్నారు.   టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్న ఆయన 2014 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయనను కలిసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది.                             


 వైసీపీ ఓడిపోవడంతో ఆయన కొద్ది కాలానికి వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఏ పార్టీలో చేరలేదు. తెలుగుదేశం పార్టీలో చేరదామనుకున్నా ఆయనకు స్థానిక రాజకీయాలు దారి ఇవ్వలేదు.  దాంతో సైలెంట్ గా ఉండిపోయారు.  మధ్యలో పవన్ కల్యాణ్ కూడా దాడి వీరభద్రరావుతో ఒకటి రెండు సార్లు సమావేశం అయ్యారు కానీ.. జనసేనలో చేరలేదు. తర్వాత మళ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ అవకాశం ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏదో ఓ నమినేటెడ్ పోస్టు అయినా ఇస్తారేమో అనుకున్నారు. కానీ దాడి కుటుంబాన్ని సీఎం జగన్ అసలు గుర్తించలేదు. ఏ పోస్టూ ఇవ్వలేదు. పార్టీలో ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. దీంతో దాడి కుటుంబం చాలా కాలంగా రాజకీయంగా కార్యకలాపాలేమీ లేకుండానే ఉంది.                            


కీలకమైన గవర సామాజికవర్గంలో పట్టు ఉన్న నేతగా దాడి వీరభద్రరావుకుపేరు ఉంది.కానీ చేసిన తప్పటడుగుల  వల్ల.. ఆయనతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను అంధకారం చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీలో చేరినా  ఆయనకు టిక్కెట్ లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆయన చేరిక కోసం టీడీపీలోని కొంత మంది ఉత్తరాంధ్ర నేతలు  చంద్రబాబు వద్ద రాయబారం నడిపినట్లుగా తెలుస్తోంది. అన్నీ  కలసి వస్తే పోటీ అంశం చూద్దామని..  ముందుగా పార్టీలో చేరడానికి ఏ అభ్యంతరం లేకుండా చూసుకున్నారని ఉన్నారు.            


అదే సమయంలో మరో ఉత్తరాంద్ర నేత  కొణతాల రామకృష్ణ కూడా  యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు వీరిద్దరే అనకాపల్లిలో ప్రత్యర్థులుగా ఉండేవారు. టీడీపీ తరపున దాడి, వైసీపీ తరపున కొణతాల పోటీ పడేవారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మారిపోవడం.. మారిన రాజకీయాలకు తగ్గట్లుగా ఈ నేతలు అడుగు వేయకపోవడంతో వెనుకబడ్డారు.