Ambati Rayudu :   వైఎస్ఆర్‌సీపీలో చేరి గుంటూరు జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న  అంబటి రాయుడు పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం  ఆయన  తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామంలో  పర్యటించారు.  వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .  ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు.  అనంతరం ఖాజీ పేట గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో రైతులతో అంబటి రాయుడు ముచ్చటించారు.  అనంతరం శాలి వాహన సంఘ సభ్యులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించారు. పిల్లలతో ముచ్చడించారు. 


సమస్యలు ఏకరువు పెట్టిన రైతులు                    


రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతున్నప్పుడు రైతులు వారు పడుతున్న ప్రధాన సమస్యలు అంబటి రాయుడు దృష్టికి తీసుకువచ్చారు.  కౌలు రైతులకు గుర్తింపు కార్డ్ సమస్యలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు సమస్యలు రైతులు అంబటి దృష్టికి తెచ్చారు.  దుగ్గిరాల గ్రామంలో ఉన్న సీసీఎల్ ఫ్యాక్టరీ వల్ల నీటి కాలుష్యం అవుతందనీ దానివల్ల గ్రామంలో నీటి ఎద్దడి ఇబ్బందికరంగా ఉందని అంబటి రాయుడు దృష్టికి తీసుకెళ్లారు.  సీసీఎల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులందరికీ అండగా ఉంటానని అంబటి రాయుడు హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న రోడ్లు బాగోలేవని గ్రామస్తులు అంబటి రాయుడు దృష్టికి తీసుకెళ్లారు. 


గ్రామానికి ఆదాయం అందించే క్వారీని కూడా గ్రామానికి కాకుండా చేశారని అసంతృప్తి                 


కొలకలూరు గ్రామంలో ఉన్న 8 ఎకరాలు క్వారీ గతంలో గ్రామంలోనే వేలం  వచ్చిన నిధులు గ్రామం అభివృద్ధికి ఖర్చు చేసేవారని.. ఇప్పుడు గుంటూరులో వేలం వేసి నిధులను గుంటూరు వాళ్లకే ఇస్తున్నారని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్వారీ వల్ల గ్రామానికి రావాల్సిన ఆదాయం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  శాలి వాహన సంఘ సభ్యులతో సమావేశమైనప్పుడు వారు కుండలు తయారీ చేత్తో చేస్తున్నామని..  ఎలక్ట్రిక్ పరికరాలు ప్రభుత్వం అందించేలా చూడాలని కోరారు.  కుండలు తయారీకి అవసమైన మట్టి అందుబాటులో ఉండటం లేదని అంబటి దృష్టికి తెచ్చారు. 


రైతులు సంతోషంగా ఉన్నారని మీడియాకు చెప్పిన అంబటి రాయుడు


అయితే రైతులు అనేక సమస్యలను ఏకరవు పెట్టినప్పటికి మీడియాతో మాట్లాడినప్పుడు అంబటి రాయుడు..  ప్రభుత్వపరంగా తమకు మంచి సపోర్ట్ అందుతుందని రైతులు చెప్తున్నారనీ
రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాననీ .. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు తమకు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెప్తున్నారనీ చెప్పారు. రైతులు తాము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారని.. ప్రభుత్వ స్కూల్స్ చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు.  విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోందన్నారు. సీఎం జగన్ ను ఆటల గురించే కలిశాను తప్ప.. రాజకీయాల గురించి కలవలేదన్నారు.  ప్రజలకు సేవ చేయాలని మా తాత నుంచి నేర్చుకున్నానని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు.